బాల్యవివాహ నిషేధము
11 - 4 - 1928
"సోదరులారా ! తేజోరాసులగు పురుష సంతతికై ప్రార్థింపు"డని వివేకానందుడు భారతీయుల నుద్బోధించెను. కాని తేజోమతులగు మాతలు లేనిదే సారవంతమగు సంతతి గలుగుటెట్లు" ముక్కుపచ్చలారని బాలికలకు పుస్తె కట్టుచున్నప్పుడు విజ్ఞానహీనులగు భార్యలు, వికాస దూరులగు మాతలు, నిర్బంధ బాలవిధవలుతప్ప వీరమాతలు ఎటునుండి వత్తురు?
బట్ట కట్టుటకూడ నెరుగక, మూర్తీభవించిన ప్రకృతి దేవతలవలె జీవించు వన్యజాతులలోగూడ లేని యీ ప్రకృతి ధర్మ విరుద్ధమగు దురాచారము హిందూసంఘము నావేశించి, పీల్చి పిప్పి చేయుచున్నది. బాల్యవివాహముల మూలమున హిందూజాతి శారీరక బలము స్రుక్కి పోవుచున్నది; మనోవికాసము మరుగువడి బోవుచున్నది, నైతికదృష్టి నీరసించి పోవుచున్నది, దాంపత్య సౌఖ్య మడుగంటుచున్నది, సంఘశాంతి విలోపమగుచున్నది ప్రతి సంవత్సరము నీ ఘోర పిశాచమునకు వేలకొలది అమాయక బాలికలు బలియయి, తమ యావజ్జీవమును దుర్భర దుఃఖముతో గడుపుచున్నారు మూఢవిశ్వాసములకు బలియగుచున్న విధవల సంఖ్య నానాటికి పెరిగిపోవుచున్నది. 1921వ జనాభా ప్రకారము, 5 సంవత్సరముల లోపలనే భర్తలను కోల్పోయినవారు 19 వేలును 5 నుండి 10 సంవత్సరముల లోపువారు 85 వేలును, 10 నుండి 15 సంవత్సరములవారు 234 వేలును గలరు మొత్తముమీద స్వయంకృతాపరాధమేదియు లేకనే దుర్భర వైధవ్య దుఃఖము లనుభవించుచున్నవారు 329 వేలమందిగలరు. తరుణుల కంటి నీటిచే మసిబట్టిన వంటయిండ్లు తడుచుచున్నంతకాలము హిందూ జాతికి శుభము చేకూరదు
బాల వితంతువుల వివాహము పేరెత్తినచో ఆర్య ధర్మములు అడుగంటి పోవునని పూర్వాచార పరాయణులు గగ్గోలు పెట్టుదురు. కాని ఆర్య ధర్మములను