Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైద్రాబాదు సివిల్ సర్వీసు

2 - 3 - 1932

బ్రిటిషు ఇండియా ఐ. సి. యస్ పరీక్షలెట్లో, మైసూరు సంస్థానములో మైసూరు సివిల్ సర్వీసు పరీక్షలెట్లో, మన రాష్ట్రములో హైద్రాబాదు సివిల్ సర్వీసు పరీక్షలట్లు ఏర్పాటుఅయి అనేక సంవత్సరములైనది ప్రతి సంవత్సరము 52 విద్యార్థులను ఈ సర్వీసులోనికి తీసుకొనుచున్నారు. కాని యీ పరీక్షలలో మనకు బ్రిటిషు ఇండియాకును, మైసూరునకు చాల భేదమున్నది బ్రిటిషు ఇండియాలోని పరీక్షలకే విద్యార్థులు బి ఏ. పరీక్షయందుత్తీర్ణులై యుండవలెను. ఆ విద్యార్థులు పరీక్షయియ్య వలసిన విషయమంతయు, ఇంగ్లీషులోనే యుండును ఒక్క పత్రికమాత్రమే ఏదైన యొక ప్రాచీన భాషలో (Classical) నుండును.

మన రాష్ట్రములోని పరీక్షా విషయములో బహుకాలము నుండి ఏ కారణముచేతనో హిందువులు కృతార్థులగుటలేదు ఒక్కొక్క సంవత్సరమొక్క హిందువు సహితము సర్వీసునకెన్నుకొనబడడు ఇట్లు అనేక సంవత్సరముల నుండి జరుగుచున్నది. దీనికి కారణములు చాలమందికి సరిగా తెలియదు హిందువులకు ప్రోత్సాహము ప్రభుత్వమువారు కలిగించుట లేదని జనులనుకొనుచున్నారనియున్నది సరికాదనియు ప్రభుత్వ పక్షమున యొక ప్రకటన కావింపబడెను. ప్రభుత్వమువారిట్లు అనుచున్నారు.

"సెలక్షను బోర్డువారు హిందువులకు ప్రతికూలముగా నున్నారని యనుచున్నారు. కాని ఎన్నికలను జేయునప్పటి యంకెలజూచిన ప్రభుత్వము వారికందఱును సమానులేయని విశదమగును. నియమముల ప్రకారము వయస్సులో ముల్కీ యగుటలో, ఆరోగ్యవిషయములోనే విద్యార్థి తృప్తికరమగు నిదర్శనములను జూపించునో యతడు దరఖాస్తు ఇయ్యవచ్చును దరఖాస్తులను విచారించునపుడు ప్రభుత్వమువారు హిందులయెడ ప్రత్యేకముగా రియాయతీ ఛేయుచుందురు. ఆఖరు నియామకము పరీక్షా ఫలితమును బట్టి యుండును.