రామప్ప దేవాలయము
9-7-1930
ఓరుగల్లులోని రామప్ప దేవాలయము పునర్నిర్మాణము గూర్చి నైజాము ప్రభుత్వము వారు పదునాలుగువేల రూపాయల విరాళము నొసంగుట వేరుచో ప్రకటింపబడిన వార్తలవలన తెలియును ఈ దేవాలయములు ములుగు తాలూకా పాలము పట్టు అను నొక గ్రామమునకు రెండుమైళ్ళు దూరమున మహదరణ్యములో గలవు. పిల్లల మర్రి, నాగులపాడు, పానగల్లు దేవాలయములకన్నను నీ దేవాలయముల శిల్పము మిగుల మనోహరముగానున్నది. పదునొకొండవ శతాబ్దమునాటి యాంధ్రుల శిల్పమును జూడదలతుమేని రామప్ప గుడి యందు మూర్తీభవించియున్నది. అచట గల శిలా శాసనముల వలస నీ యాలయము రుద్రదేవుని యనంతరము గణపతి రాజ్యారంభమున రేచర్ల గోత్రేయుడగు రుద్రసేనానిచే గట్టబడినటులందెలియుచున్నది.
చరిత్రాంశములతో నిండియున్న నిట్టి ప్రదేశమును కాపాడుటకు తలపెట్టిన ప్రభుత్వము వారిని మేమెంతేనియు నభినందించుచు, ఇట్టులే ఇతర ప్రాంతములందున్న ప్రదేశముల కాపాడ సలహానిచ్చుచున్నాము.