పుట:Geetha parichayam Total Book.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరచిపోయి చివరకు హిందువులైనారు. హిందువులు కూడ ఇందూమతము లోని భాగస్వాములే అయినప్పటికి మిగత మతములకంటే వెనుకబడి యుండడము, జ్ఞానహీనులు కావడము వలనను హిందూమతము క్షీణించుటకు కారణమైనది. నేడు భారత దేశములో హిందువులుగనున్న ఎందరో క్రైస్తవులుగ, ముస్లిమ్‌లుగ మారిపోవడము జరుగుచున్నదని ఒప్పుకోక తప్పదు. ఒకప్పుడు దైవమార్గములో అందరికి మార్గదర్శకమైన ఇందూమతము నేడు హిందూమతముగ మారిపోయి జ్ఞానమార్గములో వెనుకబడిపోవడము, హిందుమత గురువులలో ఐక్యతలేక భగవద్గీతకు అన్యముగ బోధించుట వలనను, హిందూ మతములోని ప్రజలకు తమకు మూలగ్రంథమేదో తెలియక గీతను వదలి భారత రామాయణ పురాణములను ఆశ్రయించుట వలనను హిందూమతము క్షీణించుటకు అవకాశమేర్పడినది.

క్రైస్తవులకు మేము క్రైస్తవులమని తెలుసు, వారికి మూలగ్రంథము పరిశుద్ద బైబిలు అని తెలుసును. మహ్మదీయులకు మేము ముస్లిమ్‌లమని తెలుసును, వారి మూల గ్రంథము పవిత్ర ఖురాన్‌ అని తెలుసును. హిందువులలో కొందరికి తప్ప చాలామందికి వారిది హిందూమతమనిగాని, వారికి మూల గ్రంథము భగవద్గీత అనిగాని తెలియదు. క్రైస్తవులు బైబిలును, ముస్లిమ్‌లు ఖురాన్‌ను ఎంతో పవిత్రముగ చెప్పుకొందురు. ఆ గ్రంథములను మించినవి లేవని వారు చెప్పుకొనుచుండగ, వారి హృదయములలో వారి మూల గ్రంథములకు గొప్పస్థానముండగ, హిందువులలో భగవద్గీతకు గొప్ప స్థానము లేకుండపోయినది. అన్ని మతములకు మూలగ్రంథమైన భగవద్గీతను ప్రక్కన పెట్టి భాగవతమును గొప్పగ చెప్పుకొనువారు హిందువులలో చాలామంది గలరు. ఇందూమతములోని గురువులు భగవద్గీతకంటే ఎక్కువగ పురాణములను చెప్పుటచేత, గీతకిచ్చిన స్థానమునే కల్పిత కథలకు,