పుట:Geetha parichayam Total Book.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకారము ఇంతవరకు ఏ భగవద్గీత వ్రాయబడియుండలేదు. కావున వాటిలో ఎన్నో సంశయములు మిగిలినవనుటలో తప్పులేదు. సంశయరహిత జ్ఞానము గీత నుండి అర్థము కావాలంటే తప్పక పై సూత్రములను అనుసరింప వలసివుండును. పై సూత్రములలో నాల్గవ సూత్రమును గీత మీద వర్తింపజేస్తే, అందులోని అశాస్త్రీయ కల్పిత శ్లోకములన్నియు బయటపడగలవు. భగవంతుని ఉద్దేశ్యమునకు ఏ శ్లోకములైతే భిన్నముగనున్నవో అవన్నియు ఈ సూత్రముతో దొరికి పోవును. భగవంతుడు చెప్పిన భావమంతయు శాస్త్రబద్దమే, కావున ఆమాటలు చదివిన వారికి ఎటువంటి సంశయములు మిగలవు. పై నాలుగు సూత్రములకు సంబంధము లేని శ్లోకములు భగవద్గీతకు ఏ మాత్రము సంబంధములేదని చెప్పవచ్చును. ఇపుడు ఈ సూత్రములు ప్రయోగించి గీతామహత్యమునకు, గీతకు సంబంధమేమైన కలదేమో చూచెదము.

గత కాలములోని పెద్దలు ఏదో మంచి చేయాలనుకొంటే ఆ పనులు నేటి సమాజములో దురదృష్ఠవశాత్తు అర్థములేనివై, అనర్థములతో కూడుకొన్నవై నిలిచినవి. పెద్దలు ఆశించిన ఫలితములకంటే వేరు ఫలితములు ఎదురైనవి. ఉదాహరణకు యమలోకమును గురించి అది ఎక్కడోవుందని, అక్కడ పాపముల పట్టిక ప్రకారము నరకము అనుభవింపవలసి ఉంటుందని భయోత్పాతము కల్గునట్లు వాస్తవానికి అక్కడ లేని యమలోకమును గురించి వర్ణించారు. దాని వలన ప్రజలకు పాపమంటే భయముకల్గి, పాపపు పనులు చేయకుందురని పెద్దల భావము. వారిది మంచి భావమేయైనప్పటికి దాని ఫలితము ఆశించినట్లు లేకుండ ప్రజల యందు వేరు విధముగ తయారై పోయినది. పాపము చేయువానికి పాపభీతి కల్గడములేదు. చేయుపని చెడ్డదని తోచినప్పటికి అది ఆ సమయానికి అనుకూలమైన పనియని పాపమువస్తే రానీలేనని, యమ లోకానికి పోయినప్పుడు కదా అనుభవించేదని, మరణించిన తరువాత ఏమో జరుగునని ఇపుడెందుకు వదులుకోవాలని, అపుడు ఏమి జరుగుతుందో ఎవడు చూచాడని, యమలోకమనునది దృష్ఠాంతము లేని మాటయని ఇష్టమొచ్చినట్లు