పుట:Geetha parichayam Total Book.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి వాదనను చూచి మొదటివాడు వీరెంతో తెలివి తక్కువవారని, వీరితో వాదించుటకంటే ఊరకుండుట మంచిది అనుకొన్నాడు.

ఈ విధముగనే జగతిలో మూడు రకముల మనుషులున్నారు. సత్యమును గ్రహించినవారు ఒకరకము, సత్యమును గ్రహించి పైకి ఒప్పుకోలేని వారు రెండవ రకము, సత్యమును గ్రహించలేక, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లు కొంతయిన వెనుదిరిగి ఆలోచిస్తామనుకోక, తనకు తెలిసినదే సత్యమని మొండిగ వాదించువారు మూడవ రకము. దైవ విషయములో సత్యమును తెలిసినవారు కోటికి ఒకరు అరుదుగ ఉండగ, అంతరంగములో సత్యమును ఒప్పుకొని బయట ఒప్పుకోనివారు కొందరున్నారు. సత్యమును ఏమాత్రము గ్రహించలేక మొండిగ వాదించువారు ఎందరో గలరు. దైవ మార్గములో సత్యమునే తెలియాలని పట్టుదల గలిగి సత్యాన్వేషియై, సత్యమును తెలిసినవాడు కోటికొకడుండడము అరుదైన విషయమే. భూమివిూద సత్యమును తెలిసినవాడు అరుదుగ ఎవడో ఒకడుండవచ్చును. వానిని దారిలోనున్న మొదటివానిగ చెప్పుకోవచ్చును. మొదటినుండి తమకు జ్ఞానము తెలుసునని చెప్పుకొనుచు గురువులుగ, స్వాములుగ, ఆధ్యాత్మికవేత్తలుగ చలామణి అయిన వారికి దైవమార్గములో కొంత తెలిసివుండుట వలన చివరకు తమ జ్ఞానము తప్పని, సత్యాన్వేషి చెప్పిన జ్ఞానమే నిజమైనదని తెలిసి, పైకి ఒప్పుకొంటే ప్రజలలో ఇంతవరకున్న గౌరవము తగ్గునని, మొదటినుండి తాము చెప్పుచున్నదే చెప్పుచుందురు. తమలోని పొరపాటును బయటపడకుండ, తాము బయటపడకుండ తెలిసి అసత్య వచనములాడుచుందురు. ఇటువంటి వారు దారిలోని రెండవ రకము వారు. సత్యమును ఏమాత్రము ఎప్పటికి గ్రహించలేక తమకున్న కొద్దిపాటి జ్ఞానమే గొప్పదనుకొని, తాము చేయు ఆచరణయే సరియైనదనుకొని, ఎవరేమి చెప్పిన విననివారు గలరు. ఇటువంటి వారిని దారిలోని మూడవరకము వారిగ లెక్కించవచ్చును.