Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూచి క్రాపింగుంచుకుంటకు, అవకతవకగా నాలుగింగ్లీషు ముక్కలు పేలిందుకు, కళ్లజోళ్ళూ, మేజా బల్లలు, చేతికర్రలు కొనిందుకు ఇంట్లో వస్తువులెత్తుకుపోయి బోగము వాళ్ల కిచ్చేటందుకు సత్యంలాటి కుర్రవాళ్లనేకులు సిద్ధము.

నాలుగవ అంశము పల్లెటూళ్ల వాళ్లు పడే దండుగలు. పాపయ్య పెళ్లిసరకులు కొందామని యిల్లు బయలుదేరితే రెండు రూపాయలు పుచ్చుకొన్న టికెట్ల మేష్టరు రూపాయి పావలా టిక్కట్టిచ్చి చిల్లర లేదని తక్కిన ముప్పావలా వుంచేసుకొన్నాడు. ఇత్తడి చెంబు పట్టుకుంటే పట్టణంలో 'బెంచి మేజిస్ట్రేటు రెండు రూపాయీలు జరిమానా వేశాడు. వట్టి బట్టలకీ, జరీ బట్టలకీ, బంగారానికీ, లైటులకీ, సెంటులకీ సుమారు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయినవి. ఇంటికి వచ్చి చూచుకుంటే పట్టుబట్టలు బరంపురానివి కాక ఆల్కా చీనావి అయినవి. జరీ రాగిదయిపోయింది. అత్తరులు పులుసు కంపు, పెట్రోలు లైటు మేంటెలు తగులబడింది. అరికేను లాంతరుకు వత్తెక్కలేదు. బస్తీలలో అంతా దగే అన్నాడు పాపయ్య మామగారు. అయినా రోజుల్ని బట్టి నడవాలన్నాడు గోపాలం.

అయినా పల్లెటూళ్లను గురించి మనము బొత్తిగా నిరాశ పడనక్కరలేదు. ద్వజస్తంభము చుట్టూ చేరే పెద్దలలో కొండయ్యలాంటివాళ్లు కొందరిని ధర్మంగా ప్రవర్తించలేరా అని అదమాయించగలరు. లచ్చయ్యలాంటి వాళ్లు దారేపోయేవాళ్లకివీలుగా వుండేటందుకు రోడ్డు కాలువ కలసేమొగలో చిన్నసత్రం కటించబూనుకుంటున్నారు. వెంకయ్య యేటా వైశాఖ మాసంలో తన యింట పురాణం చదివించడం మామూలైంది. "ఇంతకీ మనలో మనకి నీతీ జాతీ లేకపోవడం, అందుకు తోడు మనలో అధైర్యం కలగడాన్ని బట్టీ, నేడు మనమీ స్థితికి వచ్చామని చీవాట్లు పెట్టిందుకు శాస్త్రిలాగు ధైర్యంగా నిలబడగలిగే వాళ్లున్నారు. కరణం యింటికి వేళకి ఎవడు వచ్చినా లేదనకుండా అన్నం పెడతాడు పురుషోత్తం లాంటి వాళ్లు బి. య్యే పేసయి కూడా బానిస వృత్తిలో చేరక దేశసేవ చెయ్యాలనే కోరికతో ప్రజాసేవ సంఘంలో చేరుతున్నారు. అయినదానికీ, కానిదానికీ యింత డబ్బు పెట్టడం పూర్వ సంప్రదాయం కాదనే పెద్దలున్నారు. చిన్న పిల్లల కోసం రుంజూలు తెంచుకుని దెబ్బలాడుకుంటోన్న పెద్దవాళ్లందరూ వాళ్లలో వాళ్లే సిగ్గుపడుతున్నారు.

గరిమెళ్ళ వ్యాసాలు

57