పుట:Garimellavyasalu019809mbp.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక

తెలుగు భాషా సాహిత్య కళాసంస్కృతుల సర్వతోముఖవిలసనానికి, వికాసానికి, ఆంధ్రప్రదేశ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ప్రకారం 1985 డిసెంబరు 2వ తేదీన రూపుదాల్చిన విశిష్ఠ విద్యా సంస్థ తెలుగు విశ్వవిద్యాలయం.

బోధన, పరిశోధన, ప్రచురణలతొ పాటు విస్తరణసేవ, రాష్ట్రేతరాంధ్రులకు, విదేశాంధ్రులకూ సహాయసహకారాలలో కల్పన వంటి బహుముఖీన కార్యక్రమాలను కూడా ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది.

పూర్వం ఉన్న అకాడమీలు, తెలుగు భాషా సమితి, అంతర్జాతీయ తెలుగు సంస్ధ విలీనం కావడంతో విశ్వవిద్యాలయం వివిధ పీఠాలు, కేంద్రాలు, విభాగాల సమాహరంగా వ్యవహరిస్తున్నది. తెలుగు జాతి వైభవోన్నతులకు అద్ధం పట్టే గ్రంధాల ప్రచురణ విశ్వవిద్యాలయ ప్రధాన ఆశయాల్లో ఒకటి.

విశ్వవిద్యాలయంలో విలీనమైన అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవిశ్రాంత కృషిద్వారా దేశసాహిత్య రంగంలో విశిష్టస్థానం సమకూర్చుకుంది. విలక్షణమైన వందలాది గ్రంధాలను ప్రచురించింది.

విశ్వవిద్యాలయం ఈ ప్రచురణ సత్ సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నది. గరిమెళ్ల శతజయంత్యుత్సవ ప్రారంభ సభలకి ఆయనకి నివాళి ఈ గ్రంధాన్ని మీ ముందుంచుతున్నది.

"గరిమెళ్ళ వ్యాసాలు" గ్రంధం గురించి -

ఈవ్యాససంకలనంలో ప్రజల పాటల గరిమెళ్ళకి మరోవైపు బలమైన వ్యాసరచయితని చూడవచ్చును.

స్వాతంత్య్ర సమరకాలంలో గళం విప్పి మహోజ్వల జాతీయగీతాలు పాడగా ప్రజల నుర్రూతలూగించి ఆంగ్లేయపాలకుల గుండెల్లో సింహస్వప్నమయ్యారు గరిమెళ్ళ నాటి దేశభక్తిపోరాటాన్ని 'మాకొద్దీతెల్లదొరతనం ' 'సైతాను ప్రభుత్వమిక సాగనీయకండోయ్ ' యనే చరణాల్లోదట్టించి ఫిరంగి గుండ్ల కన్న శక్తిమంతంగా గుండెలదిరేటట్లు సంధించాడు.