Jump to content

పుట:Ganapati (novel).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

319

వాండ్రు పాటలు చెప్పుకొన్నట్లు గణపతి తన కలాపభాగము నొకరిచేత చెప్పించుకొని వల్లించెను. ఇప్పుడు కొన్ని రాగము లతఁడు నేర్చుకొనెను. కాని చిన్ననాఁడు తల్లి కొట్టినప్పుడు, పంతులు బాదినప్పుడు పెట్టు రాగాలకు, నీ రాగాలకు నంతగా భేదము కనబడలేదు. ఆ నాడు సత్యభామ నిర్విఘ్నముగా దన కలాపము వినిపించెను. హాస్యగాని వేషము కంటె కృష్ణవేషమే సభ్యుల కెక్కువ యానందము గలిగించెను. అనగా నతఁడు చక్కగా కథాకలాపము వినిపించుటవల్ల నని తలంపవలదు. వామనావతారమున దలపించు నతని మూర్తియే మొదట నానంద కారణ మయ్యెను. తరువాత నానందకారణ మిది. తాను జగద్రంజకముగఁ దన కథాభాగము వినిపింపగల నని గంపంతయాసతో నుండఁగా సభాసదులం జూడగానే యతనికి మేన ముచ్చెమటలు బోసెను. నోట మాట వెడలలేదు. తన స్నేహితుల యెదుర తన కవమానము గలుగు నని యాతఁ డెంతో వగచి జ్ఞాపకము జేసికోవలెనని కడు ప్రయత్నము చేసెను. కాని తాళము పోయిన పెట్టెలో నున్న వస్తువువలెనే కథా భాగము దుర్లభ మయ్యెను. సభాసదు లందఱు జప్పటలు గొట్టి నవ్విరి. అంతలో హాస్యగాడు కృష్ణవేషగానిని కొంచెము కదిపి మాటలాడించవలె నని 'మాధవా! మన దే యూర ' ని యడిగెను. కృష్ణవేషములో నుండుటచే ద్వారకకాపుర మని గణపతి యుత్తరము జెప్పుటకు మారుగా 'మనది మంద