Jump to content

పుట:Ganapati (novel).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

గ ణ ప తి

గారికి భాగము లేకపోయినను శరపరంపరలై వెడలు తిట్లలో మాత్ర మాయనకు పెద్దభాగమె వచ్చుచుండును. బడికి వెళ్ళిన తరవాత సయితము గణపతి గురువుగారిని సుఖముగ నుండ నిచ్చువాఁడు కాడు. కన్నుమూసి తెరచునంతలో నతఁడు మాయమగు చుండును. చుట్టుప్రక్కల వెదకి వెదకి పంతులు కనుగొనలేక విసుగు చుండును. బడిపేరు చెప్పగానె గణపతికి నడుము నొప్పి కాళ్ళతీత కడుపునొప్పి, గుండెపోటు, తలనొప్పి మొదలగు రోగములు పొడచూపుచుండును. ఈ రోగములు నప్పుడప్పుడు పంతులుగారు బెత్తము నుపయోగించి చికిత్సలుచేసి కుదర్చుచుందురు. ఎన్నిమారులు చికిత్సలు చేసినను వాని కారోగము మాత్రము కుదరలేదు. ఎల్లరోగములు చికిత్సలకు సాధ్యమగునా? బడిమాని యేపని చేయమన్నను మన గణపతికి పరమానందము. బడిపేరు చెప్పగానే యతని మొగము వెలవెలబోవును. ఈ మహాపద దప్పించుకొనుటకై యతఁ డెన్నో యుపాయములు పన్నజొచ్చెను. తెల్లవారుచున్న దనఁగానె యతని కెంతోభయము. ఏలయన మేనమామ బడికి పొమ్మనును. అందుచేత నతఁడు దినమంతయు రాత్రిగానె యుండవలయునని కోరుచుండును. పంతులుగారికి రోగము రావలయునని యతఁ డెన్నిమారులో కోరెను. కోరుటయెగాదు, ఒకసారి చీకటితోనే లేచి కాకులు కూయకమున్నె యమ్మవారిగుడికిఁబోయి తలుపు దగ్గఱ నిలిచి "అమ్మవారా తల్లీ మా పంతులుగారికి విశూచి జాడ్యమైన