పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

దంపూరు నరసయ్య


అనిపిస్తుంది.

“మహారాజ రాజశ్రీ కందుకూరు వీరేశలింగంపంతులుగారు ధైర్యసాహసములతో అనేక హిందూ స్త్రీ పునర్వివాహములను చేయుచున్నారు గనుక సి.యస్.ఐ. బిరుదుకు తగుదురని పీపుల్స్ ఫ్రెండ్ పత్రికాధిపతులు వ్రాయుచున్నారు.” అని వీరేశలింగం సేవలను ప్రశంసిస్తూ నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రకటించిన అభిప్రాయాన్ని 1889 మార్చి ఒకటవ తారీకు హిందూ జనసంస్కారిణి పునర్ముద్రించింది. ఈ ప్రశంస వల్ల కూడా నరసయ్య వీరేశలింగం వెంట, సంస్కరణవాదుల జట్టులో ఉన్నట్లు తెలుస్తుంది. “వీరేశలింగంగారి మార్గంలోనే వెంకటగిరిలో కొన్ని వితంతు వివాహాలను నరసయ్యగారు జరిపించార”ని బంగోరె పేర్కొన్నాడు.56 "He is a member-Veeresalingam Pantulu Saranalaya" అని బంగోరె తన నోట్సులో రాసి, పక్కన 'రాధమ్మ' అనే పేరు గుర్తు రాశాడు. “నరసయ్య వెంకటగిరి అరవవీధిలో ఉండే పురాణం వెంకటసుబ్బయ్య మరదలు రాధమ్మకు వీరేశలింగంగారి వద్ద పునర్వివాహం జరిపించారు” అని కమలమ్మ (నరసయ్య మనుమడు శేషయ్య భార్య) చెప్పింది. “నరసయ్య మద్రాసులో జరిగిన వితంతు వివాహాల్లో పాల్గొన్నారు. వెంకటగిరిలోనో, మద్రాసులోనో, మా ద్రావిడుల అమ్మాయికి పునర్వివాహం జరిపించారు. ఆమె సంతతి ఇప్పుడు నాగపూరులో ఉంటున్నారు” అని నరసయ్య మనుమడు కృష్ణమూర్తి వివరించాడు.

ఏజ్ ఆఫ్ కన్‌సెంట్ బిల్లు ( Age of Consent Bill ) ను ఎంతోమంది సంస్కరణవాదులు సమర్థించినా, తొలితరం నాయకులు టి. మాధవరావు, ఎస్. సుబ్రహ్మణ్యఅయ్యరు, చెంచలరావు మొదలైనవారు సమర్థించలేదు. వీరిలో కొందరికి అప్పటికే దివ్యజ్ఞాన సమాజంతో సంబంధాలు ఏర్పడ్డాయి. కొందరి మీద ఆ సమాజ ప్రభావం ఉంది. మద్రాసు బ్రాహ్మణులు తమ కుర్రవాళ్ళను సంస్కరణోద్యమ ప్రభావం నుంచి కాపాడుకోడానికి దివ్యజ్ఞాన సమాజాన్ని అడ్డుపెట్టుకున్నారు.57 వీరేశలింగం, నరసయ్య దివ్యజ్ఞాన సమాజాన్ని ఎద్దేవా చేశారు. "Avoid the absurd claims of the Theosophist and other shams" అని పరిహాసం చేస్తూ రాసిన వాక్యాలను నరసయ్య 1886లో పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రచురించాడు.58 థియోసఫిస్టు దివ్యజ్ఞాన సమాజం వారి పత్రిక. నిజమైన సంస్కరణవాదులకు దివ్యజ్ఞానసమాజం బలమైన ప్రత్యర్ధి, బద్ధ శత్రువు. 1897లో నరసయ్య చేసిన కన్యాశుల్క సమీక్షలో తాను ఎవరి వెంట ఉన్నది స్పష్టం చేశాడు. ఆయన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్లు ఆ వ్యాసంలో వెల్లడి అయ్యాయి.

నరసయ్య సంఘ సంస్కరణ నిబద్ధతను నిరూపించడానికి లభించిన ఆధారాలు చాలా పరిమితమైనవి. ఆయన సంస్కరణవాదుల వెంట ఉన్నాడని చెప్పడానికి ఈ రుజువులు చాలు. పీఠాధిపతుల బెదిరింపులు, బహిష్కరణలకు నరసయ్య భయపడి