పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

దంపూరు నరసయ్య

ముందుంచడానికి ప్రయత్నిస్తాను.

మీ పత్రికలో ప్రకటన ప్రకారం, గుర్రం వెంకన్నశాస్త్రి ఒకటవతేది, ఆదివారం తిరువత్తూరు వెళ్ళి, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పూజ్యులు ఆచార్యులను ముందుగా అనుకొన్న ప్రకారం ఆ రోజు కార్యక్రమం మొదలుపెట్టడానికి అనుజ్ఞ కోరాడు. ఆయన అనుమతి ఇవ్వగానే, తాను రాసిన పుస్తకం వినిపించడం మొదలుపెట్టాడు. పుస్తకపఠనం మొదలయ్యే సమయంలో అక్కడే ఉన్న రంగనాథశాస్త్రి, అనంతరామశాస్త్రి కనిపించకపోవడం గమనించి, వారిద్దరినీ లోపలకు వచ్చి కూర్చోవలసినదిగా ప్రార్థిస్తూ, ఒక సేవకుని ద్వారా సందేశం పంపాడు. ఇంత ముఖ్యమైన సందర్భంలో వారు వెళ్ళిపోవడంవల్ల, పుస్తకపఠనం జరుగుతున్నవేళ అక్కడ ఉండడం వారికి ఇష్టంలేదనో, మరేదైనా సంగతో అని అనిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్న నాకు అప్పుడు ఏదో ఆశ్చర్యం కలిగించే విషయం జరగబోతున్నట్లు స్పురించింది. ఆందోళన, ఉత్సుకత మనసును పెనవేసుకొంటూ ఉంటే, ఈ సాయంత్రం ఇంకా ఏంచూడబోతామో అని అందరం ఎదురుచూచాము. తినబోతూ రుచులడగడమెందుకని, కళ్ళు చెవులు అప్పగించి గమనిస్తూ ఉన్నాను. ఇంతలో ఆ ఇద్దరు శాస్త్రులు వెంకన్న ముందుకు వచ్చి, ఆయన వాదంలో లోపాలకు అక్కడికక్కడే అభ్యంతరం తెలపడానికి అవకాశం ఇవ్వాలని ఒక్కమాటగా అడిగారు. వారి ఇష్టప్రకారమే చెయ్యవచ్చనీ, ముందు వారిద్దరు తన వద్ద ఉన్న కాగితం మీద చేవ్రాలు చెయ్యాలని, తాను చేవ్రాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని వెంకన్నశాస్త్రి సమాధానం చెప్పాడు. మొదట కట్టుబడి ఉంటామని చేసుకొన్న ఒప్పందం ప్రకారం, ఆ కాగితంలో వివరించబడిన నిబంధనలను అనుసరించి వివాదం పరిష్కరించుకోవచ్చని వివరించాడు. (ఈ నిబంధనలు ఈ ప్రయోజనాలను ఉద్దేశించి తయారుచేసినవని నాకు తర్వాత తెలిసింది. వెంకన్నశాస్త్రి, రంగనాథ శాస్త్రి అనంతరామశాస్తులకు రాసిన లేఖలో ప్రతిపాదించిన విధంగా, ఎంపికచేయబడిన పండితమండలి తీర్పు సంతృప్తికరమైన చివరి తీర్మానంగా ఓడినవారు అంగీకరించాలి. అందువల్ల పుస్తకం ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగించేదని, అందులో ప్రమాదకరమయిన సిద్ధాంతాలున్నాయని, నిరూపణ అవుతుంది. అటువంటి పుస్తకం రచించినట్లు రచయిత సిగ్గుపడి, ఒప్పుకొన్నట్లవుతుంది. ఇటువంటివే ఇంకా కొన్ని నిబంధనలు ఆ కాగితంలో ఉన్నాయి. మొదట వారు ఆ ప్రతిపాదనను అంగీకరించారు కాబట్టి, ఇవి న్యాయమైన నిబంధనలే అని అంటున్నాను. అటువంటి నియమాలు పెట్టుకోవాలని వారే పట్టుపట్టారు.)

మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించిన నోటీసులో ఈ నిబంధనలేవీ లేవు గనుక, వెంకన్నశాస్త్రి హేతుబద్ద ప్రతిపాదనలకు తాము కట్టుబడడానికి సిద్ధంగా లేమని వారు సమాధానం