పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

23

“కొందరు ఆచారభ్రష్ఠులు నాస్తిక వాదులవుతున్నారు. వారిని సంతోషపెట్టడానికి అనంతరామశాస్త్రి రజస్వలానంతర వివాహాలను సమర్ధిస్తూ పుస్తకం రాశాడు. మనువు మాటలకు అపార్థం కల్పించి బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కులాలవారు గాంధర్వవివాహం చేసుకోవచ్చని, దీనిని మనుస్మృతి అంగీకరించిందని, పరాశరస్మృతిని పాటించనవసరం లేదని వాదించాడు. ఆయన మాటలు మూర్ఖులను మోసగించవచ్చు. అవి శాస్త్ర విరుద్ధమైనవి” అని వెంకన్నశాస్త్రి తన పుస్తకాన్ని మొదలుపెట్టాడు. ఈ పుస్తకంలో ఎనిమిది పరిహాసాలున్నాయి. ఒక్కో పరిహాసంలో అనంతరామశాస్త్రి ఒక్కో వాదాన్ని పూర్వపక్షంచేసి, తన నిర్ధారణను ప్రతిపాదించాడు. ఎనిమిదో పరిహాసంలో ప్రత్యర్థి వాదాన్ని సమగ్రంగా సమీక్షించి ఖండించాడు. ఈ పుస్తకాన్ని 1865 అక్టోబరు 1న కంచి పీఠాధిపతి మద్రాసు వచ్చినప్పుడు, పీఠాధిపతి నివాసంలో జరిగిన పండితసభలో పఠించాడు. ఆ సభలో రంగనాథశాస్త్రి, అనంతరామశాస్త్రి ఉన్నారు. వీరి మధ్య చర్చ తీవ్రంగా జరిగి, ఒకరినొకరు దూషించుకొనే స్థాయికి దిగజారింది.

మద్రాస్ టైమ్స్ (1858)

గాంట్జు సోదరులు (Gantz brothers) మద్రాసులో పుస్తకవిక్రేతలుగా ఉంటూ, మద్రాస్ టైమ్స్ పత్రికను ప్రారంభించారు. 1857 సంక్షోభం తర్వాత, యూరోపియన్లకూ, దేశీయులకూ మధ్య సంబంధాలు బెడిశాయి. రెండుజాతుల మధ్య సామరస్యం, సత్సంబంధాల పునరుద్దరణ కోసం ఈ పత్రిక కృషి చేసింది. మద్రాస్ టైమ్స్ పత్రిక సి.ఏ. లాసన్, హెన్రీ కోర్నిష్ (C.A. Lawson, Henry Cornish)ల సంపాదకత్వంలో ప్రారంభమైంది. పత్రిక ఉదయం, సాయంత్రం సంచికలు వెలువడేవి. న్యూస్‌సర్వీసు సౌకర్యం లేకపోవడంవల్ల, విలేకరులు, 'కంట్రిబ్యూటర్సు' పంపే వార్తల మీద, రచనల మిద పత్రిక ఆధారపడుతూ వచ్చింది. చిన్నవ్యాపారులు, టీతోటల యజమానులు, మధ్యతరగతి యూరోపియన్ల అభిప్రాయాలను పత్రిక వినిపించింది. ప్రభుత్వ విధానాల మీద ఘాటుగా విమర్శలుండేవి. ఈ పత్రికలో మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. సుందరలింగం, లెనార్డ్ తమ పరిశోధన గ్రంథాలలో ఈ పత్రికను ఎక్కువగా ఉపయోగించుకొన్నారు. వెంకన్నశాస్త్రికి, అనంతరామశాస్త్రి వర్గానికి మధ్య జరిగిన చర్చను నరసయ్య ఈ పత్రికలో సంపాదకీయ లేఖల ద్వారా వివరించాడు.

లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్

రంగనాథశాస్త్రి , వెంకన్నశాస్త్రి మధ్య వివాదం పూర్తిగా చల్లారక ముందే, పదిహేడేళ్ళ వయసులో పచ్చయ్యప్ప ఉన్నతపాఠశాలలో 'అసిస్టెంట్ టీచరు' ఉద్యోగంచేస్తూ, నరసయ్య ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. “లేటర్స్ ఆన్ హిందూ మేరేజస్ ఆర్ జి.