పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

127


నరసయ్య ఆలోచనలకు పెద్దగా అంతరం ఉన్నట్లు అనిపించదు.

వందేమాతరం ఉద్యమం మొదలు కావడంతో దేశరాజకీయాలలో, ప్రజల అభిప్రాయాలలో పెనుమార్పులు సంభవించాయి. ఈ ఉద్యమం ఆరంభమయ్యే నాటికి నరసయ్య పత్రిక నిలిచిపోయింది. ఈ ఉద్యమం గురించి ఆయన ఎట్లా స్పందించాడో నిరూపించడానికి ఆధారాలు లభించలేదుకాని, మిత్రులతో కలిసి, నెల్లూరులో స్వదేశీ స్కూలు స్థాపించడానికి మంతనాలు సాగించినట్లుంది. 1906 ఆగష్టు 8 దినచర్యలో “కొమాండూరు నర్శింహాచార్లు called and we had some talk about our proposed స్వదేశీ School" అని రాసుకొన్నాడు. ఆయన వందేమాతరం ఉద్యమాన్ని ఆమోదించి, ఉద్యమంతో ముందుకు సాగినట్లు సూచనప్రాయంగా దినచర్యలోని ఈ వాక్యంవల్ల తెలుస్తూంది.

జైలు సంస్కరణ - మరణ శిక్షరద్దు

నరసయ్య పత్రికను సమకాలిక పత్రికలకంటె విశిష్టంగా నిలిపిన అంశాలు కొన్ని ఉన్నాయి. 1900-1901 రెండు సంవత్సరాల నేటివ్ న్యూస్‌పేపర్ రిపోర్టులలో ప్రభుత్వ అనువాదకుడు ఆంధ్రభాషా గ్రామవర్తమాని నుంచి అనువదించినన్ని విషయాలు మరే తెలుగు పత్రికనుంచి అనువదించలేదు. ఈ పత్రిక రాతలు ప్రభుత్వ అనువాదకుని దృష్టిని ఆకర్షించినంతగా మరే పత్రిక రాతలు ఆకర్షించలేదు.

నరసయ్య జాతీయ అంతర్జాతీయ సమస్యలను నిశితంగా పరిశీలించినట్లు, అమెరికాలో నల్లవారి విముక్తి పోరాటం నుంచి అనేక విషయాలమీద ఆయన దృష్టి నిలిపి ఆసక్తి కనపరచినట్లు ఆయన అధ్యయనం చేసిన గ్రంథాలవల్ల కూడా తెలుస్తూంది. జైలు సంస్కరణలమీద రాసిన వ్యాసం ఈ అంశాన్ని నిరూపిస్తూంది.

డార్టుమూర్‌జైలు (Dartmoore prison) లో ఖైదీలు 1400 ఎకరాలు సాగుచేసి, పంటలు పండిస్తున్నారని, అటువంటి సంస్కరణలు భారతదేశం జైళ్ళలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నరసయ్య ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాడు. జీవితఖైదు విధించి, ద్వీపాంతర వాసశిక్ష అమలుచేయడంకన్నా, విశాలమైన బీళ్ళలో జైళ్ళు ఏర్పాటుచేసి, ఖైదీలచేత వ్యవసాయం చేయించి, ఆధునిక కృషి విధానాలను వాడుకలోనికి తేవాలని సలహా ఇస్తాడు.68

నరసయ్య మరణశిక్షను వ్యతిరేకించాడు. “హిందువులు అహింసావాదులు. సమస్త సుగుణాలలో అహింస ఉత్కృష్టమైనదని భావిస్తారు” అని మరణశిక్ష రద్దుకు కారణాలు