Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిత్తంబు జొత్తిల్ల నొక్క కృతిఁ జెప్పంబూనితి …………. ”

రామగిరి పట్టణాధీశ్వరుండగు కుమార ముప్ప భూపాలుని మాన్యమంత్రియైన కందమాత్యునకుఁ గవి భాగవత దశమస్కంధమును దెనిఁగించి యంకితమొనర్చినట్లు ఈ వచన భాగమునుండి స్పష్టమగుచున్నది. ప్రస్తుత పరిష్కరణము యొక్క కాండాంత పద్యములందు కననగు కృతికర్త కృతిభర్తల నామగోత్రాది వివరములును, వాసిష్ఠరామాయణ పద్మపురాణములయొక్క కృతికర్త కృతిభర్తల నామగోత్రాది వివరములును నచ్చొత్తినట్లు సరిపోయి యున్నందున భాగవత దశమస్కంధము (ప్రస్తుతపరిష్కరణము) మడికి సింగనార్య కృతమనుటలో సందేహముండదు. తెనుఁగు జాతీయతను బోషించు శైలిని బట్టి చూచినప్పుడును భాగవత దశమస్కంధము, వాసిష్ఠరామాయణము, పద్మపురాణము ఈ మూఁడును నేకకవికృతములను సత్యము నుద్ఘాటించుచున్నవి.

వాసిష్ఠరామాయణ పద్మపురాణములను పద్యకావ్యములుగా రచించిన మడికి సింగన్న భాగవత దశమస్కంధమును మాత్రమేల ద్విపదకావ్యముగా విరచించెను? శ్రీకృష్ణభగవానుని లీలలను వీనుల విందుగాఁ బండిత పామరులందఱును, ఆబాలగోపాలము పాడుకొని యానందించుటకు వీలగునట్లు సరళమైన జాతీయగీతమగు ద్విపదలలో నిమడ్చి రచియించుట మంచిదని యుచితజ్ఞుండగు కవి తలంచి యట్లొనరించెనని తలంచెదను. అదియునుగాక క్రీ.శ. 1240వ ప్రాంతమున రచించపఁ బడిన రంగనాథరామాయణముయొక్క సకలజనాదరణమును విచారించి కవి తాను గూడ నట్టి కావ్యమును రచింప నుత్సహించి భాగవత దశమస్కంధమును ద్విపదబద్ధము గావించెనేమో!