పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 43

బుడ్డిచెంబులు, దోసకాయ చెంబులు, జోడితప్పెల, దబరాగిన్నె మొదలగువాటిని పరచిపెట్టి వుంచును. రాతిచిప్పలు కూడ వుండును. వంట త్వరలో చేయుటకు నాలుగుపొయిలను ఒకేసారి బుడ్డి కిరసన్నూనెతో ముట్టించును. పొయి నిండుగ కట్టెలు, పిడకలను తురిమి స్నానమునకు పోవును. వచ్చులోపల యిల్లంతయు పొగ కమ్ముకొని యింటిలో వస్తువులు కనపడక తట్టుకొనుచు చుండుటయేగాక ఇల్లాలి కండ్ల నిండుగ నీలాలు కారుచుండును. వైదికులమడి తడిగుడ్డ గనుక తడిగుడ్డతోనె వంట చేయుచుండెను. అయితే వంట ముగియు లోపల మడిబట్టు ఆరుచుండును.

మా యింటిలో వేయించిన కందిపప్పే వాడుక, గనుక ప్రతిదినము ముద్దపప్పు లొడ్డుపులుసు, వేపుడుకూరలు, రెండుపచ్చళ్ళు, పండు మిరపకాయల కారము ఉండితీరవలయును. రాత్రిళ్ళు అన్నములోకి పప్పుపొడి, గోంగూర, చింతకాయ పచ్చళ్ళు, చిక్కటి మజ్జగ ఉండవలయును. ప్రతి శుక్రవారము అమ్మణ్ణికి నేతి గారెలను నైవేద్యము పెట్టుచుండినది. పిండివంటల నోమును పట్టుచుండినది. నోము వుద్యాపనకు గారెలను బూరెలను నేతిలో చేసి బుట్టనిండుగపెట్టి ముత్తైదువకు వాయన మిచ్చుచుండెడిది. శనివారం వెంకటేశ్వరునకు చలిమిడి పిండి, నేతి దీపారాధన చేయుచుండెను. వ్రతమునకు వండిన నేతిగారెను ఒక్కటైనను నా కివ్వమని ఆశపడి అడిగినప్పుడు వ్రతమునకు చేసిన వాటి నిచ్చిన ప్రతభంగము కల్గునని నిర్దాక్షిణ్యముగ నిరాకరించెడిది.

వరలక్ష్మీవ్రతమునాడు అరవతల్లి మంగళాంబను భోజనమునకు పిలుచును. అప్పుడామె నా భర్తను విడిచిపెట్టినేను విందు భోజనము చేయుట వీలుగాదని చెప్పును. అప్పుడు నేను అయ్యర్ను కూడ భోజనమునకు