పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182 చిన్ననాటి ముచ్చట్లు

కొద్ది. అయితే ఈమె ప్రతి శుక్రవారమునాడు తన యింటిలో వీణి కచ్చేరిని జరుపుచుండెడిది. అప్పడు అభిమానులు ఆమె యింటికిపోయి వీణపాటను వినేవారు.

వేణుగాన గాయకులలో ప్రథమమున మద్రాసుకువచ్చి అసమాన పాండిత్యమును చూపిన మహానుభావుడు శరభశాస్త్రిగారు. వీరు పుట్టినది మొదలు ఈ పాడులోకమును చూడక జ్ఞానేంద్రియములతోనే వేణుగాన మభ్యసించి కీర్తిని బడసిన పుణ్యపురుషుడు. వీరి తర్వాత వేణుగానములో ప్రసిద్ధి చెందినవారు నాగరాజరావుగారు, పల్లడం సంజీవరావుగారు.

ఆ కాలమున శరభశాస్త్రిగారు వేణుగానము, గోవిందస్వామి ఫిడియలు, అళగనంబి మృదంగము గొప్ప పాటకచ్చేరిగ నుండెను. ఈ ముగ్గురికచ్చేరి ఒకనాడు జార్జిటవున్లో యొక శెట్టిగారింట జరుగుతుందని దెలిసి నేనును నాతో కూడ నెల్లూరి కాపురస్తుడు విస్సా రామారావుగారును వెళ్లితిమి. అప్పడు విస్సా రామారావుగారు మద్రాసులో లా కాలేజీలో చదువుచుండిరి. గానప్రియులు. ఈ కచ్చేరీకి రావలసిన విద్వాంసులలో శరభశాస్త్రివారును గోవిందసామి ఇరువురు వచ్చిరిగాని మృదంగమును వాయించు అళగనంబి యింకను రాకయుండెను. వచ్చిన పాటకులు కొంతవరకు వేచియుండి మృదంగమునకు మరియొకని యేర్పాటుచేసి సభను సాగించిరిగాని శరభశాస్త్రిగారికి మృదంగమంతగ సహించలేదు. అళగనంబిగారు వచ్చు రైలు ఆలస్యముగ వచ్చినందున వారు అరగంట ఆలస్యముగ సభకువచ్చి శాస్త్రిగారి ప్రక్కన మెల్లగ కూర్చుండి తిన్నగ మద్దెలమీద దెబ్బవేసిరి. ఆ సుశబ్దమును శాస్త్రిగారు విని ఆనందముతో 'అణ్ణా వందియా' (అన్నా వచ్చావా) అని అళగనంబిని చేతితో తడిమి సంతోషించెను. అప్పడు సభ్యులందరు గొల్లున నవ్విరి. ఈ పుట్టంధుడు