పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

మానవసేవ

మానవసేవ అంటే స్త్రీపురుషులను దుర్మార్గవృత్తులనుండి సన్మార్గములకు మరల్చుటకు చేసే కృషి. వారిలో స్త్రీ సాధారణంగా పొట్టకూటికి లేనప్పుడే తప్పు త్రోవ త్రొక్కును. అదియును కొన్నాళ్లు మాడిమాడి పిదప కక్కుర్తిపడును. కొందరు మానవతులు మాత్రము అట్టే పస్తుండి తుదకు ఆకలిబాధకు తాళలేక ప్రాణత్యాగము చేసుకొనుచున్నారు. పురుషుడో తిండి దండిగ నున్నప్పడే మదించి చెడుమార్గమునకు తిరుగును.

కావున స్త్రీ శ్రేయోభిలాషులై స్త్రీలనుద్దరింప దలచినవారందరును అనాథలకు బ్రతుకుదెరువును చూపించి కాపాడుటయే మానవసేవ.

ఈ పతిత జనోద్దరణము మన దేశమున కొత్తగాదు. నిష్కారణముగ అపనిందల పాలైనవారిని యుద్ధరించుట అంతకన్న శ్రేష్ఠమైనది. అహల్యను ఆమె భర్త రాయికమ్మని శపింపగా శ్రీరామచంద్రమూర్తి ఆమెను కరుణించి శాపవిమోచన మొనర్చెను. సత్యవతియు, కుంతియు - అవివాహితులుగనే సంతానవతులయ్య - పిదప ఉత్తమ రాజపత్నులు, రాజమాతలునై వర్ధిల్లిరి. సీతను, అపవాద పరితప్తను, భర్తచే అడవిలో విసర్జింపబడినదానిని వాల్మీకి ఆదరించి, పురుడుపోసి, శిశువులను తల్లిని పోషించి తిరిగీ వారిని రాముని సన్నిధానమునకు చేర్చియున్నాడు.

గుంటూరు శారదానికేతనమునకు తల్లిదండ్రులు ఉన్నవ లక్ష్మీబాయమ్మగారును, వారి భర్త లక్ష్మీ నారాయణగారున్నూ. వీరిరువురు ఏకమనస్కులై పాటుబడుచున్నారు. ఆదిలో కందుకూరి వీరేశలింగము పంతులుగారితో కూడ పనిచేసి పిమ్మట గుంటూరులోనే వితంతూ