పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 133

గర్భాష్టమియందు గాని, అష్టమ వర్షమందు గాని ఉపనయనము జరుపబడును. ఉపనయన విధి చాలావరకు మనదేశమునందువలెనే జరుగును; కాని యజ్ఞోపవీతధారణా నంతరము మన పురోహితులు బ్రహ్మచర్య విధులు - గ్రుక్క తిప్పకుండ సంస్కృతమున ఏకరువు పెట్టుదురు. వారు అట్లుగాదు; సంస్కృతమున చెప్పినదానిని బాలున కన్వయమగుటకు మళయాళ భాషలో కూడ చెప్పదురు.

వీరిలో పెద్దవాడొక్కడే స్వకులమున వివాహమాడును. పిదప సోదరులందరును అక్కడ అగ్రజాతిశూద్రులైన నాయర్ స్త్రీలను వివాహమాడుదురు. ఈ ఆచారము ఎట్లువచ్చిన దనుదానిని గూర్చి పలుగాథలున్నవి. ఈ నంబూదిరీలు తొలుత వచ్చినప్పుడు వీరితో కూడ కొలదిమంది స్త్రీలే వచ్చిరట. పురుషులందరికి చాలినంతమంది స్త్రీలు లేరు పెద్దవాడు మాత్రము స్వకులమున వివాహమాడుటయు, మిగతవారు పరిచారికలైన శూద్రస్త్రీలను వివాహమాడుటయు ఏర్పడిన దందురు. జమీందారులగు నంబూదిరీలు వారి ఆస్థి చీలిపోకుండ ఏకముగా నుండుటకై ఆచారము నేర్పరచుకొనిరని కొందరందురు.

వరుని మనవాళన్ అని పిలుతురు. ఈ మనవాళన్ను స్వకులములో ఉత్తమునిగా చూతురు; కాని సమీపరక్త బంధువులు వివాహమాడరాదు. ఉత్తముడనగా వేదవేదాంగముల నభ్యసించినవాడు, సదాచార సంపన్నుడు, ధనవంతుడు. నంబూదిరీలలో వరాన్వేషణమేగాని వధునన్వేషించుట యెరుగరు. వివాహవిధులు చాలవరకు మనకువలెనే జరుగుతున్నవి.

పెండ్లికూతురిని సంపూర్ణముగ మేలిముసుగువైచి వరుని వద్దకు పిలుచుకొని వత్తురు. అప్పడామె పెళ్లికుమారుని ముఖము చూడకుండ అతనికి తన ముఖము కనపడకుండ - తాటియాకు గొడుగును