పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130 చిన్ననాటి ముచ్చట్లు

పారిపోయిరట. వారే నేడు సారస్వత బ్రాహ్మణులు అని పిలువబడు అందమైన జాతి.

పరశురాముడు రెండవసారి భక్తాగ్రేసరులు, పండితులు, మంత్రశాస్త్రవేత్తలునైన బ్రాహ్మణులను ఆర్యావర్తమునుండే తిరిగి రావించి వారికాభూమిని దానమొసగెను. రెండవసారివచ్చిన బ్రాహ్మణులు తపస్సంపన్నులు, మంత్రవేత్తలుగావున మృగసర్ప బాధలకు జంకక వానిని వశమొనర్చుకొని అక్కడనే స్థిరవాస మేర్పరచుకొనిరి. ఇట్లు రెండవసారి వచ్చినవారే నంబూదిరీ బ్రాహ్మణులు.

నంబూదిరీలు

వేదవేదాంగవేత్తలు; మహాకర్మిష్టులు, మంత్రశాస్త్రనిధులు, శిష్టాచార సంపన్నులు, ఆ వైదికాచారకర్మ పరాయణులై వీరు సామాన్యముగా ఇల్లు వదలి పైకిరారు. ఇతర కులముల స్పర్శ వీరికేమాత్రము పనికిరాదు.

వీరు తొలుదొల్తగా నీభూమికి వచ్చినప్పడు ఇది నిర్ణన ప్రదేశమగుట ఆర్యుల నాగరికత ననుసరించి వీలైనంత భూమి నాక్రమించి, సస్యములు, వృక్షజాతములు వృద్ధిచేసుకొనుచు అనుభవించిరి. ఆ భూములు వారి స్వంతమైనవి. నమ్మిక కలవారగుట, ఆచార సంపన్నులగుట, బ్రాహ్మణులగుట, పిదప రాజులు భక్తిపూర్వకముగ విస్తారముగ భూములను వీరికి దానమొసంగిరి. ఇట్టి భూముల ననుభవించు వీరిని 'జన్మీలు' అందరు - అనగా జమీందారులు (భూస్వాములు) అని అర్థము.

విధివిహితమగు షోడశకర్మలలో జాతకర్మ మొదటిది. బిడ్డపుట్టిన 36 గం||ల లోపున బిడ్డతండ్రి బిడ్డ ముఖారవిందమును చూచును. అంతట నాతడు స్నానముచేసి వచ్చి బిడ్డను వడిలో కూర్చుండబెట్టుకొని జాతకర్మ