పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15

కేరళ దేశాచారములు

కొన్ని సంవత్సరములకు ముందు నేను తిరుచూరు మకాములో ఉండగ మా ఇంటి మదురుగోడ ప్రక్కన పెద్దమంటలు మండుట చూచితిని. ఆ మంటయేమని మా యింటిలోని వారి నడిగితిని. మృతిజెందిన వారి కళేబరములను ఇంటివారి దొడ్డి తోటలలోనే దహనముచేయు ఆచారము కేరళదేశమునగలదని వారు చెప్పిరి.

తిరుచూరుకు సమీపముననే కాలడి అను పల్లెటూరు గలదు. ఈ గ్రామమున శివగురు అనునొక ప్రసిద్ద నంబూదిరీ బ్రాహ్మణోత్తముడుండెను. వీరికి ఆర్యయను నొక సతీ తిలకముండెను. ఈ శివగురు సకల శాస్త్ర సంపన్నుడై ధర్మపత్నితోగూడి యజ్ఞయాగాది క్రతువులనొనర్చి ప్రసిద్ధి చెందియుండెను. ఈ బ్రాహ్మణునకు వయసు చెల్లుచుండినను సంతానసంపద లేకయుండెను. అప్పడా శివగురు ధర్మపత్నితో సహా వృషగిరి అను శివక్షేత్రమునకు వెళ్లి అక్కడ శివభజనను చేయుటకు ప్రారంభించెను. అప్పడు శివుడు వారి భక్తికి మెచ్చుకొని పుత్ర సంతానము గలుగునట్లు వారికి వరమిచ్చి అనుగ్రహించెను. పిమ్మట కొంతకాలమునకు భార్య గర్భవతి అయి పుత్రుని గనెను. ఈ పుత్రునిచూచి శివగురునకు మితిలేని ఆనందము గలిగెను. ఈ బిడ్డడే విశ్వవిశృతుడైన ఆదిశంకరాచార్యస్వామి. వీరు క్రీస్తుశకము 806 సం||మునకు సరియగు కలివర్షం 3927 చైత్రమాసము (మేడమాసం 18 తేది) 18 తేదిన కాలడి గ్రామమున స్వగృహమునందు జనన మందిరని పండితులు నిర్ణయించిరి.

శంకరునకు మూడవ సం||ము వయసు దాటకమునుపే తండ్రి పరమపదించెను. అప్పటినుండి బాలుడు తల్లి చాటుననే పెరిగెను. వీరి