పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు115

ఇక్కడ గంగా యమునా నదులు సరస్వతి అంతరవాహినిగా చేరి పారునట్టి కూడలి. ఈ కారణమున ఈ సంగమస్థానమునకు త్రివేణియను పేరు గల్లినది.

కాశీయాత్రకు వచ్చినవారు ముఖ్యముగ ఈ త్రివేణి సంగమము నుండియే గంగను తీసికొనిపోవుదురు. ఇక్కడ పారు జలమునకే అత్యంత మహాత్మ్యముండినటుల దెలిసికొనిరి. పాశ్చాత్య శాస్త్రవేత్తలుకూడ ఇక్కడి జలమును పలువిధములుగ పరీక్షించి ఈ జలమున రోగబీజముల నశింపజేయు శక్తిగలదని నిరూపించిరి. అందువల్ల ఈ జలమును పాత్రయందుంచి సీలుచేసిన యెన్ని సంవత్సరములైనను జలము చెడిపోక శుద్దముగ నుండును. మరియు ఈ జలమును తామ్రపాత్ర యందుంచుట మహావిశేషము. తామ్రమునకు క్రిమికీటికాదులను నశింపజేయు శక్తిగలదు. ఈ కారణముననే మన పూజాపాత్రలను తామ్రముతో చేసిరి. వాటినే వాడుచుండు పూర్వీకుల ఆచారము యిప్పటికిని గలదు. రోగక్రిమి నాశనమునకు రాగితాయిత్తులనే బిడ్డలమెడలలోను మొలలకును కట్టుదురు. ఈవిధముగ ఆరోగ్యసూత్రములతోకూడిన ఆచారము లెన్నియో కలవు.

త్రివేణి సంగమం మధ్యకు మేము పసుపు, కుంకుమ, పండ్లు, రెవిక మొదలగు వాయనపు సామానులను తీసికొని పడవనెక్కిపోతిమి. పురోహితుడు కూడ యుండి మంత్ర తంత్రములను జరిపిరి. సాధారణముగ గొప్ప క్షేత్రములన్నియుగూడ పరిశుభ్రముగ నుండవు. ఈ పట్టణమున గొప్ప గొప్ప భవనములతో లక్ష్మి తాండవమాడుచుండినను దరిద్రదేవత విచ్చలవిడిగ విహరించుచుండుట చూడవలసి వచ్చెను.

త్రివేణి సంగమ సమీపమున ఔరంగజీబు కోటయుండెను. ఇది పురాతన కట్టడమైనను అతిగంభీరముగ నుండెను. అక్షయవటమను వట