పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు113

గంగా తీరమున కాల్చి గంగాభవానికి అప్పగించుటకు యేర్పడిన ఒక సేవాసమితి గలదు.

కాశీ నగరము ఆదిలో ఒక మట్టిదిబ్బగ నుండినట్లును, విశ్వనాథస్వామి బ్రహ్మహత్యకు భయపడి ఈప్రదేశమున వెలిసినట్లును స్థలపురాణము గలదు. మొదట ఇక్కడ ఉండినది శ్రీ ఆదినారాయణుడని ప్రమాణము గలదు. ఈ నగర ప్రకృతి ఆకృతి అసహ్యముగను, గజిబిజిగను కనుపించును. సందుగొందులు కలిగిన మార్గములను కలిగియుండును. మూడు నాలుగు అంతస్తుల మేడలనుగలిగి సూర్యకిరణముల కడ్డుపడు చుండును. పట్టణము పరిశుభ్రముగ నుండదు. ఈ అపరిశుభ్రమైన సందుగొందులలోనుండి విశ్వనాథ క్షేత్రమునకు పోవు మార్గముండెను. ఈ మార్గ మధ్యమున గోమాతలు విచ్చలవిడిగ సంచరించుచుండెను.

చిన్న గర్భగుడిలో వెలసియున్న నిరాడంబరమగు శివలింగమును జాతిమత భేదములులేక రాత్రింబవలు పూజించు క్షేత్రము మరియొక్కడను లేదు. స్వామిని పూజించు ప్రత్యేక పూజారి లేడు. వస్త్రాభరణములు సున్న. అచ్చటనుండి గయాక్షేత్రమునకు వెళ్లితిమి. దర్భతంత్రము జరిగినది. ఆకులు వేసినారు. కడుపు నిండియున్న గయావళులు త్రేన్పుతూ, ఆకులముందు కూచున్నారు. వడ్డించిన పదార్ధములలో ఇష్టమైనదానిని రుచి మాత్రము చూచిరి. పిమ్మట వటవృక్షమువద్దకు మమ్ములను తీసుకొని వెళ్లినారు. గంధముపూసి పూజించి దక్షిణ యివ్వవలయును. పితృదేవతలను తలచుకోవలయును. కర్తలు ప్రమాణపూర్తిగా నేను యింతమాత్రమే దక్షిణ యివ్వగలనని చెప్పవలెను. అట్లా చెప్పనియెడల 'గయాశ్రద్ధ ఫలితమస్తు' అని వీపున గట్టిగ కొట్టరు.

ఫల్గుణీ నదీ తీరమున జరిపిన కర్మకాండానంతరము విష్ణుపాదము నందు రెండవసారి పితృ దేవతలను దలచుకొని పిండ పితృ తర్పణములను