పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/833

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుగారు వట్టి అమాయికులు

937


ఆశతఘ్నిని (ఫిరంగిని) పాశుపతంచేత ఖండించి ఆ సందర్భాన్ని చమత్కరించిన విషయాన్ని బోధిస్తుంది. అర్థిప్రత్యర్థులు పరస్పరమున్నూ వకరి అస్త్రాలను వకరు ఖండించుకుంటారు. గురువులవారు ఆవలిపండితుఁడు తమరిని గూర్చి వ్రాసినదాన్ని ఖండించలేదే. ఆపండితుఁడు తమరినిగుఱించి యేంవ్రాశాడు పాపం. ఆయన్ని పోషించే ప్రభువును ఆశీర్వచించుకొన్నాఁడు. తమ ప్రత్యర్ధియెవరో పెండ్లికుమారుణ్ణి ఆశీర్వచించిన పద్యాలను గద తాము "తగలఁబెట్టుకొ" మ్మన్నది. దానికిన్నీ దీనికిన్నీ లేశమాత్రమేనా పోలిక వుందా? "పృష్ఠతాడనా ద్దంతభంగః". పైగా యీ పాశుపత పద్యంలో "శ్రాద్ధం పెట్టినట్లు" కూడా వుందంటారు గురువుగారు. కవితా రసాస్వాదనంచేసే రీతి యీలాగేనా? యీ పద్యంలో యెదటివారిని గూర్చి "అబ్బాయీ మీ వాదం వోడిపోయింది" అని యెత్తిపొడవడమే పరమార్థం. గురువుగారి “తగలఁబెట్టుకొమ్ము అమంగళం, అశుద్ధం," అనే వాక్యంలోనో అన్యార్థం లేశమున్నూ లేదు. అంతా దురర్థమే. దీన్ని యీపాటికేనా సమర్థించే యత్నం మానితే బాగుండును. యెందుకు మానతారు? ప్రస్తుతం జరిగే వివాదుకంతా యిదేగదా “మూలకందం ముకుందం.” యిది మూలమని బాహ్యానికి కనబడుతూవున్నా గీరతకాలం నాటికే కొంత అసూయ గురువుల హృదయంలో అంకురించివున్నట్లు సమర్థించడానికీ కొన్ని ఆధారాలు యిటీవల గురువులు వ్రాసే వ్రాతలలో దొరుకుతాయి. ఆ తగలబెట్టడాన్ని నిరసించిన పండితులనందఱినీ దూషిస్తూ నన్ను మిక్కిలిగా దూషిస్తూ "శృంఖలం" అంటూ వ్రాసి దాన్ని దాచి దాచి తుదకిప్పుడు అది పౌరుషంకాదని ప్రకటించారు. దాని ప్రకటనవల్ల ఆ శ్లోకాలు చెప్పిన బ్రాహ్మడికి వృత్తిచ్ఛేదమవుతుందని కూడా ఆపినట్లు గురువులే వ్రాశారు. యిప్పుడు వృత్తిచ్ఛేదం అవుతుందేమో చూడాలి. వేడినీళ్లవల్లనే యిండ్లు కాలతాయి కాఁబోలును. నాపూన్కి ఆ బ్రాహ్మడి వృత్తిని నిల్పుగాక, నాకు దీనివల్ల పుణ్యం కలుగుఁగాక. యెన్నఁడో భస్మమైపోయిన శతఘ్నిని యిప్పుడు మళ్లా కాలదోషపు ప్రోనోటులాగ బయటికి లాగుతూవున్నారు. పాశుపత మేమయిందనుకున్నారో? -

పాపం "క్షమాపణ" అనే నిర్దుష్టమైన పదం కూడా వారికి నింద్యగ్రామ్యజాతిలో చేర్చవలసివచ్చింది. యింకొకచిత్రం. అది సర్వదా నిర్దుష్టపదం అన్న సంగతి మావల్ల తెలుసుకోవడం జరిగిందా? అలా జరిగినా యిప్పటిక్కూడా ఆ తెగలో చేరినవాళ్లు మాత్రం క్షమాపణ అనడానికి బదులుగా క్షమార్పణ అనే వ్రాస్తూవుంటారు. యీపదం అపశబ్దమైతే కాదుగాని యే అర్థం యివ్వాలో ఆ అర్ధాన్ని మాత్రం యివ్వడానికి పనికి రాదు. గురువుగారుకూడా "క్షమార్పణ" అనే వాడుతూ వుంటారు. పైపదం నిర్దుష్టమన్న సంగతిని యెఱిఁగినవారుపండితులలోకూడా క్వాచిత్కంగా వుంటారు. ఆలాగే కాకపోతే శ్రీ వ్యాసమూర్తిశాస్త్రుల్లుగారి వంటి వారు "నింద్యగ్రామ్య" మనడం తటస్థించదుకదా.