పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/786

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

890

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


బ్రహ్మంగారిచేత దుందుడుకుమాటలు వ్రాయిస్తూన్నారు. అందుచేత దీన్ని సుధర్మకు పంపేను. హెడ్డింగులో దోషాలన్నారు. యేమిటంటే శ్రీ జటప్రోలు సంస్థాన యువరాజుగారిని వివాహ సమయంలో ఆ సంస్థానపండితులు వనం సీతారామశాస్త్రుల్లు గారు అయిదుశ్లోకాలతో ఆశీర్వదించారు. ఆపండితునివల్ల మా గురువుగారికి ఆ సంస్థానంవారి వల్ల రావలసిన రెండు వేలరూపాయల లబ్ది చెడిపోయిందట? ఆ హేతువుచేత కసితీర్చుకొనడానికి తోచి నట్లల్లా ఆ శ్లోకాలు విమర్శించి అంతతో తృప్తికాక "సీ........... ఓయి సీతారామశాస్త్రి....... నీ కవిత్వము...... అశుద్ధము (యిందులో దిక్కుమాలిన పాడు అర్థము కవి వివక్షితము) అమంగళము. (కాcబట్టి యీ వేసవిలోనేత్వరగా) సంస్కార మొనరించుకొమ్ము" ఇత్యాదికంగా కొంత కర్ణకఠోరంగా వ్రాసివున్నారు. ఆ సందర్భంలోనే "కృష్ణవర్మను ప్రార్థించి" అని కూడా అన్నారు. యిందులో కొంచెం శ్లేషకూడా వుంది. అలా తగల బెట్టడం వల్ల నీవు “భూతిగలవాఁడ వగుదువు" అన్నారు. అంటే నీ కింత బూడిద దొరుకుతుంది. అని కూడా శాసించారు. గురువుగారి వాక్యాలకి మనం వ్యాఖ్యానం చేయడం కంటె వారి వ్యాఖ్యానాన్నే వుదాహరిస్తే యెక్కువ యుక్తంగా వుంటుంది కదా!

(దురుద్ధరదోషశృంఖలం 18వ పుట నుండి)

"సుధీమణి పద్యములలో భగవంతుఁ డవతరించినను సమర్ధింప నేరనంత దోషమేమున్నదో? నీ కవిత్వము నీయింటిపేరును బోలి యున్నది. (వనము) కంటకాకీర్ణము, మహోపలావృతము, సాలావృకాది సత్వాన్వితము, సంస్కార శూన్యము, అమంగళము, అశుద్ధము, దోపైక వేద్యము రక్షఃపిశాచాంచితము" అని చెప్పి "కృష్ణవర్మను బ్రార్థించి" అనుగీతములో సంస్కార మొనరించుకొమ్ము = బాగుచేసికొనుము కాల్చివేసికొమ్ము, భూతి = ఐశ్వర్యము, బూడిది ఈ రెండుపదములు శ్లేషించినవి. ఇట్లు రెండర్థములు గలుగునట్లు చెప్పుట సుధీమణి తప్పనియే నేను చెప్పుచున్నాను. ఇన్ని దోషములు గలుగు పద్యములు లోకములో నున్నచో నిహపరములకు దూరము గావలసి వచ్చును. గాన లోకములో వానికి వ్యాప్తిలేకుండ కాల్చివేయుమని చెప్పిన నొప్పునని చెప్పుచున్నాను. యింతకన్న నిఁక నేదోషమును సుధీమణి పద్యములలో లేదనియుఁ జెప్పుచున్నాను. ఉన్నదని చెప్పఁగలవాడు బయలుదేఱినచో సమాధానము చెప్పుటకు నే నిదే సిద్ధముగా నున్నాఁడను."

ఇత్యాదికముగా చాలా వ్రాసియున్నారు. యీ వ్రాఁతవ్రాయునప్పటికింకా ఆ పద్యములు తమవి కావని వాదించే తాత్పర్యంతోను సుధీమణి అంటే పుల్లెల శ్రీరామశాస్త్రుర్లుగారి తెఱచాటుననే తాముండి గురువుగారేదో వ్రాస్తూవున్నట్లు స్పష్టమేకదా?