పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

821


వచ్చినారు. ఈ రచన వీరికిఁ బరమార్థమున కెక్కుడుగ నుపచరించెడిదే యయ్యుఁ బ్రకృత మనేకులకు వీరిని శత్రుస్థానముగఁ జేసినది. దానికి బీజ మిది. "కవిత్రయకృత భారత ముండఁగా మరల నిదియేల!” అని స్థూల దృష్టుల శంక. దీనికి బోలెడు సమాధానములు కలవు. అవి యన్నియు సమంజసములే. అయినను ప్రాచీనుల యందుఁబలె నవీనుల యందు లోకుల కాదరాతిశయము కలుగదు గదా? "ఏగతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా?" ఇది నేఁడే పుట్టినదా? మన మెంత పోరాడినను ప్రయోజనము లేదు. బీజము బీజముగా నుండక మనపోరాటము వలనఁ జెట్టు గట్టఁజొచ్చును. ఆ బీజమును గ్రంథకర్త లెన్నఁడును నశింపఁజేఁ జాలరు. మన కోరికతోఁ బని యేమి, మన పని మనము చేసి కొందము, అని మౌన మవలంబించుటమే యియ్యెడ ముఖ్యకర్తవ్యము. "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన" ఆ బీజమును లోకమే క్రమముగా నశింపఁజేయుటకుఁ బూనుకొనఁ గలదు. అది యిప్పుడే కావలయునన్నచోఁ గష్ట సాధ్యము. అట్టికాలము రాఁగలదు. ప్రతీక్షింప వలయును. "కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ", అప్పుడును రెండవ పక్షముండక మానదు, ఉండుఁగాక, యేదో పక్షమువారు మనలను బరిగ్రహించినఁ జాలును గదా? అంత వఱకు మా గురువుల వారు నిరీక్షింపక యా భారమును దామే వహించి పోరాడ మొదలిడినారు. దాని మీఁద లోకములోఁ గొంత యసంతుష్టి ప్రబలఁ జొచ్చినది. అయ్యది శ్రీవారి కెక్కుడు పనిని గల్పించు చున్న మాట నిశ్చయము. ఇపుడు నా వయస్సు అఱువది వత్సరముల యెనిమిది మాసములు. గురువుగారు నాకన్న నెంతోపెద్దలు కారు. ఇపుడు వారొనర్చుచున్నయుద్ధమును గమనించినచో ద్రోణాచార్యులు జ్ఞప్తికి రాక తప్పదు. అది యటులుండె. భారతాంద్రీకరణము శ్రీవారికి స్వర్ణాభిషేకమును, కవి సార్వభౌమ బిరుదమును సంపాదించెను. అంతతో శ్రీవారు సంతుష్టి చెందవలసినది. దానికయి యచ్చటచ్చట జరుగు నభినందన సభలకు వెళ్లఁజొచ్చిరి. ఆ సభలు జరుగు చోట్లలో ముఖ్యంగా బందరులో, “పంచశుభం పంచాశుభం" అను త్రోవ రాఁజొచ్చినది, బందరు పరశురామక్షేత్రమని తత్రత్యులు పలువు రనఁగా వినియుంటిని. ఆ మాటకుఁ గలహకారక మని వ్యుత్పత్తిని చెప్పెదరు. దీనికిఁ దార్కాణముగా నేనా విషయమును స్వయముగా ననుభవించితిని. ఆ యనుభవమును నేనిట వ్రాసినచోఁ దేలదు. వలయు వారు మా పాండవ రాజసూయమును దిలకింపఁ గోరెదను. శ్రీవారి యభినందన సందర్భమును కృష్ణాపత్రికలోని ప్రధాన వ్యాసము పూర్తిగా నిరసించినది. ఆ సమయములో నేను నా కూతుల వివాహ సందర్భమున నొక పనిమీఁద నూజివీటికి వెళ్లి, గుడివాడ త్రోవను వచ్చుచు నొకటి రెండు రోజులు గుడివాడలో నిలవవలసి నిల్చితిని. అట నొక రావ్యాసమును వినిపించిరి. స్వయముగాఁ జక్షురక్షర సంయోగముగాఁ