పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



పిఠాపురప్రభువు లేటు

శ్రీ గంగాధర రామారావుగారి కథలు

పైని వుదాహరించిన ప్రభువరేణ్యుని అత్యద్భుతచర్యలు మాప్రాంతములలో తఱచుగా చెప్పకుంటూవుంటారు. నాకు కొంచెం ప్రాజ్ఞత కలిగేటప్పటికి వీరు తుట్టతుదిదశలో వున్నారు. వీరిని నేను చూడడం చూశాను. గాని, నన్నుమాత్రం వా రెఱగడానికి తగ్గస్థితిలో అప్పటికి నేను లేను. నేను కాశీనుండి కాశీకావడి బుజాన్ని పట్టుకొని వచ్చే రోజులలో తునికిన్నీ అన్నవరానికిన్నీ మధ్యగావున్న తేటగుంట, తిమ్మపురంవద్దకు వచ్చేటప్పటికి యీ మహారాజు ద్వాదశాహస్సునాఁటి సంభావన పుచ్చుకొన్న బ్రాహ్మణ్యం యెదురుగావచ్చింది. నాకు నామరూపాలు కలగడం కాశీనుంచి వచ్చిన మఱుచటినాటి నుండే కావడంచేత, వారిని నేనెరగడమేకాని నన్ను వారెఱిఁగి వుండే యోగం తటస్థించలేదు. అదిన్నీకాక యీ ప్రభువు సుమారు 5, 6, సంవత్సరాలకాలం అంత్యదశలో కొంత అనారోగ్యంగావుండి - "కాశ్యాంతు మరణాన్ముక్తి" కనక. కాశీలో భౌతికదేహం చాలించేవుద్దేశంతో వకటి రెండుసార్లు కాశీకి వెళ్లినట్లుకూడా వింటాను. కాని తుదకు వీరు తమ రాజధానియగు పిఠాపురంలోని కోటలోనే భౌతికదేహాన్ని చాలించినారు. వీరు భౌతిక దేహాన్ని చాలించేనాటికి కొంచెం పూర్వగాథలు నాకు తెలియటాని కభ్యంతరం లేదుగాని, వీరు రాజ్యానికివచ్చిన కొలఁదికాలం నాటిచర్యలు నాకు వినికివల్ల తెలిసినవేకాని ప్రత్యక్షంగా తెలిసినవి మాత్రం కావు. బహుశః, గతించిన ధాత, ఈశ్వర సంవత్సరాల ప్రాంతంలో జరిగిన వకచర్యనుగూర్చి యిందు వ్రాస్తాను.

జియ్యంగారిరాక

అప్పటికి నావయస్సు సుమారు ఆఱుసంవత్సరాలకు దాదాపు. అప్పుడు కఱవువచ్చింది. రూపాయిపెట్టి బియ్యంకొంటే చేటలోకి పూర్తిగా వచ్చేవికావు. యిటీవల బియ్యపుధర ఆమాదిరిగా వున్న రోజులు నాబాల్యానంతరం చాలావున్నాయి గాని కఱవనిమాత్రం లోకం అనుకున్నట్లు లేదు. ఆ కాలానికి అదే పెద్దకఱవు. అప్పటికింకా మా కుటుంబము కడియం గ్రామంలోనేవుంది. నాకు తగుమాత్రం అప్పటి సంగతు