Jump to content

పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

741



అన్నీ కవిత్వాలేనా?

కావు. నిశ్చయంగా కావు. కానేకావు. కవిగా జనించినవాఁడు తోచిందల్లా గిలుకుతూనే వుంటాఁడు. గృహస్థు బిడ్డల్ని కనడంలేదా? ఆలాగే కవిన్నీ అందులోనూ, యిందులోనూ కొంతమాత్రమే నాణెమైన సరుకు బయలుదేఱుతుంది. “పుత్రులు తన కుద్భవించినఁ గురూపులు కాఁగలరంచు భార్యతోఁ గలయిక మానునే?” చెట్టుకాచిన కాయలన్నీ మంచి రుచిగా వుండడం అసంభవం. ఆ యీ హేతువుచేతనే అనుకుంటాను పూర్వవిమర్శకులలో వకాయన భారత భాగవత రామాయణాలేకాక కాళిదాసాది మహాకవుల కావ్యాలుకూడా బాగా వడపోసి తుదకు “ద్విత్రాఏవ కవయః, ద్విత్రాణ్యేవ కావ్యాని” అని వూరుకున్నాఁడు. యీమాట లోకానికి యెంతేనా కంటకంగా వుండేమాట సత్యమే. అయితే మాత్రం యథార్థం చెప్పఁదలఁచుకొన్న విజ్ఞుఁడు జంకి తన అభిప్రాయాన్ని దాఁఁచుకుంటాఁడా? వాల్మీకి యిరవై నాలుగువేలు, వ్యాసులవారి తక్కిన రచనలను వదులుకొన్నప్పటికీ వొక్కభారతమే సపాదలక్షగదా? యింకా కవులెన్నియెన్ని వేలూ లక్షలూ వ్రాశారో అంతటివాఙ్మయంలో ద్విత్రాణ్యేవ, అంటే యెవరికి రుచిస్తూంది. యీమాట వ్యాసులు వొక్కచేతి మీఁద యింత వ్రాస్తే ఆపరిశ్రమనేనా ఆలోచించక చులాగ్గా చేతనైనదే కదా అని “ద్విత్రాణ్యేవ" అంటే పరిశ్రమ యెఱిఁగిన యేవిజ్ఞులు విశ్వసిస్తారు? అయితే కవిత్వానికీ, గానానికీ, వంటకీ కావలసింది మాధుర్యమా? లేక పరిశ్రమా? ఆపద్యం రచయిత కష్టపడివ్రాశాఁడో? అలాకగానే వ్రాశాఁడో అదంతా యెవరిక్కావాలి? తుట్టతుదకు తేలేది రసారస విశేషం. "సాధ్యోహి రసో యథాతథం కవిభి".

యీవిచారణలోకి దిగితే అది యింతలో తేలేది కాదు. ఆయీ నాలుగుమాటలూ యెందుకు వ్రాయవలసి వచ్చిందంటే; యిూమధ్య కొన్నాళ్లనుంచి ఆఁగి వున్న ఆదిశైవ పత్రిక మళ్లా ప్రచురింపఁ బడుతూవుంది. అందులో రెండుచోట్ల మృత్యుంజయస్తవాలు వున్నాయి. రెండోది చదివేటప్పటికి మనస్సులో యేమో భావాలు స్ఫురించాయి. యేవో కొన్ని మాటలు వ్రాద్దామని కలం చేతపట్టేటప్పటికి ఆపద్యాలు వ్రాసినకవి మావాఁడే అయినాఁడు. అయితే మాత్రం యేలా మానేది? ఉబ్బసపుపీడ మాధవపెద్ది సుందరరామయ్యకవికే కాదు మఱోకవికే కలిగితే కలుగుతుందనుకుందాం. ఆపీడ యింతటి