యేది కవిత్వం - 2
729
కవిత్వాలు లోకోత్తరాలే. యిప్పుడు మనకు చర్చనీయాంశం లోకోత్తరత్వం కాదు, మఱివకటిన్నీ కాదు. ప్రకృత కాలంలో గాంధీ గారి మాదిరిని నూటికి తొంభైతొమ్మిదివోట్లు యెవరికవిత్వానికి వస్తాయన్నది. యీ మాట పాఠకులు బాగాజ్ఞప్తిలో వుంచుకోవాలి. “బమ్మెరపోతరాజుఁ గవిపట్టపు రాజుఁ దలంచి మ్రొక్కెదన్" యీ మహాత్మునికవిత్వం కంఠపాఠంగా చాలా పద్యాలు వచ్చినవాళ్లు అక్షరాస్యులలో పలుమంది కనపడతారు.
మ. మహిమున్ వాగనుశాసనుండు సృజియింపన్గుండ లీంద్రుండు త
న్మహనీయ స్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్.
అనే పద్యంలో యీ కవిపట్టపురాజుపేరు యెక్కకపోయినా లోకంలో యీయన కవిత్వమే చాలామందికి సంధ్యావందన ప్రాయం. శ్లేషగా రచించే పద్యం. కనక వసుచరిత్రపద్యం, దానిలో అనాగరికంగా వున్న పోతరాజు పేరుకు చోటు లేకపోయింది. యే భారతకవిత్వానికీ దీనికున్న వ్యాప్తి కనపడదు.
క. వ్యాప్తిం జెందక వగవక
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్
దృప్తింజెందని మనుజుఁడు
సప్తద్వీపములనైనఁ జక్కంబడునే.
శా. కారే? రాజులు రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిన్ జెందరే
వారేరీ? సిరిమూటఁ గట్టుకొని పోవన్జాలిరే? భూమిలోఁ
బేరైనంగలదే? శిబిప్రముఖులున్ బ్రీతిన్ యశఃకాములై
యీరే? కోర్కులు; వారలన్ మఱచిరే? యిక్కాలమున్ భార్గవా?
మ. గొడుగో? జన్నిదమో? కమండలువొ? నాకున్ ముంజెయో? దండయో?
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్వామాక్షులశ్వమ్ములె
క్కడ? నిత్యోచితకర్మమెక్కడ? మదాకాంక్షామితంబైనమూఁ
డడుగుల్మేరయె త్రోయకిచ్చుటయె బ్రహ్మాండమ్ము నాపాలికిన్,
శా. ఆదిన్ శ్రీసతికొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయమ్ముపైఁ
బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁ బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందుకరంబు క్రిందగుట మీఁదై నాకరంబుంట మే
ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?