పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

690



కవితా విప్లవం - 2

కవితావిప్లవం అనే వ్యాసాన్ని నేను యెవరియందూ ద్వేషంతో వ్రాసిందికాదు. "అమ్మా! మాదాకవళం" అనేపల్లవి భాగం మాత్రమే దానిలో అంటే వొకగేయంలో నాకు శోచ్యంగా తోచింది. "గాలిదుమారము లెగరడం” వగయిరాలు నామనస్సుకు ఇబ్బందిని కలిగించలేదు. ఇది వర్ణ్యమేనా! అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. ఏదేనా పతాకా ప్రాయమైన ప్రధానకథాంశం వుంటే, దానికి ప్రకరీప్రాయంగా యిది వుండడం నాకూ సమ్మతమే అని బుద్దునికి విరక్తి కల్గించిన విషయం వుగ్గడించే వున్నాను. అశ్లీలాలలో వొకటిగా వున్న దండి ప్రహసనశ్లోక భాగాన్ని వుదాహరించి, అది హాస్యోక్తిగా సమర్ధిత మవుతుందనికూడా సూచించేవున్నాను. ప్రస్తుతం "అమ్మా మాదాకవళం" అంగి (ప్రధానం) గాని, దేనికీ అంగం గాదు. దీనివల్ల లోకం పొందవలసిన ఆనందంగాని మఱివకటిగాని (అంటే నీతిగాని - రామాదివద్యర్తితవ్యం చూ.) యేమి వుంటుందీ అని కొంతసేపు చర్చించుకున్నాను. ఆఁకలిపీడకు తాళఁజాలక దైవోపహతులు చీఁకట్లోనూ, వానలోనూ అడుక్కుంటారన్నంతవఱకే బోధ పడింది గాని, అంతకంటే అధికంగా బోధపడిందికాదు. దాని క్కారణం అప్పుడు బోధ పడలేదు గాని, దానిమీఁద గేయకర్తగారు వ్రాసిన యీ క్రింది వాక్యంవల్ల యిప్పుడు బోధపడింది. ఆ వాక్యాన్ని వుదాహరిస్తాను.

"శ్రీ శాస్త్రిగారికి రసతత్త్వం అచుంబిత విషయమేమో అనిపిస్తూంది."

నేను పైమాటకు అంగీకరిస్తున్నాను. నాకు 72 యేండ్లవయస్సు గడిచినా తేలికగా ఆబాలగోపాలానికీ తెలిసే "అమ్మా! మాదాకవళం" అనే గేయంలో వుండే రసతత్త్వం తెలియనప్పుడు, తెలిసినవారి శుశ్రూష చేస్తే మాత్రం యీ వయస్సులో ప్రయోజనం వుంటుందా? కనక, ఆప్రయత్నంకూడా చేయను. “మాదాకవళం" కవిత్వం సహృదయసమ్మత మైనట్టున్నూ, నేను హేయంగా చూపిన “కొందఱు సోదరీమణులు” అట్టిది కానట్టున్నూ గేయకర్తగారు అభిప్రాయపడ్డారు. ఇదికూడా సహృదయ సమ్మతమే అన్ని వ్రాయుటకు సాహసించనందుకు నేను ఆయన్ని అభినందిస్తూన్నాను. “మాదాకవళం" గేయంవల్ల యేదేనా విశేషార్థం పాఠకలోకానికి బోధపడేది వుంటే, “కొందఱు సోదరీమణుల”