పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

584

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శబ్దానికి హ్రస్వం వచ్చే సందర్భం కొంచెం (విపులంగా కాదు) వివరిస్తాను. అందుకు “అబ్రవీత్పురాణ" వ్యాఖ్యాత మాటలు ముందు వుటంకించాలి. అవి అపహాస్యాస్పదంగా వున్నా చూపించాలి.

"భరత వీరచరితలనెడి (యిది భారత శబ్దానికి) నదీ ప్రవాహములు గల భారతమనెడు” మూలంలో భారత శబ్దం వొకటే వుంది. అర్థంలో రెండు వుంటేకాని కాపురం తుదనెగ్గదు భవతు. (ఉచ్చరిత శబ్దోర్ధ ప్రత్యాయకో నానుచ్చరితః) దాన్నే ఆవృత్తి చేస్తేనో? ఆ సంప్రదాయం శాస్త్ర సంబంధమైన సూత్రాలకుగాని, సాహిత్య సంబంధమైన శ్లోకాలకూ తెలుగు పద్యాలకూ చెందిందికాదు. వ్రాస్తే చాలా వ్రాయాలి. సంప్రదాయం కాకపోయినా అంగీకరిద్దాం. భరతశబ్దానికి కవి వివక్షించుకున్న భారత గ్రంథమని చెప్పుకోక అవివక్షితమైన యీ అర్థం యెందుకుచెప్పాలి? భరత వీరచరితలలో వొక్కొక్కని చరిత్ర వొక్కొక్కనిది. అందరివీ అన్ని నదులు. అవి వచ్చి భారత గ్రంథమనే సముద్రంలో కలిశాయా? వో హో హో! యెంత చక్కని అలంకారశాస్త్ర విదగ్ధత్వం!!! అయితే యీ అర్థం బాగాలేదు, అని నేనంటే బాగానేవుందని ప్రతిపక్షి వాదానికి వుపక్రమిస్తే గతేమిటి? "సహృదయాః ప్రమాణమ్” అనవలసివస్తుంది. యెప్పుడూ లోకంలో నిజమైన సహృదయుల సంఖ్య తక్కువగానే వుంటుంది. కనక అప్పుడు– “పంచశుభం, పంచా౽శుభమ్"గా పరిణమిస్తుంది వాదం. కనక సుళువైన మార్గం చూచి ప్రతిపక్షి వాదాన్ని మందలించడం యుక్తం. ఆ మార్గం యెట్టిదంటే? అయ్యా! మీరు చెప్పే యేళ్లూ కోళ్లూ వచ్చి సముద్రంలో కలవడం వగయిరా గంపతిరుగుడు అర్ధాన్ని శంకించేదిలేదు. గాని- మీరు "భారత వాహినీ" శబ్దానికి భరతవీర చరితలనెడు నదీ ప్రవాహములు కల భారతమనెడు సముద్రము అని కదా? అర్థం వ్రాశారు. "కల బహువ్రీహిః" అనే అభియుక్తోక్తి నెప్పుడేనా విని వున్నారా? బహువ్రీహి చెప్పేయెడల విగ్రహవాక్యం "భారతాన్యేవ వాహిన్యోయస్య" అనేనా? అప్పుడు వాహినీ శబ్దగత దీర్ఘానికి హ్రస్వంవచ్చి "భారతవాహినిః" అనేనా కావాలి. లేదా? కప్పు (కాఫీ కప్పు కాదు బహువ్రీహి కప్పు) చేస్తేనో? “భారత వాహినీకౌ" అనేనా పరినిష్ఠితరూపం యేర్పడాలి. ఉభయధాపి ఛందోభంగం తప్పదు. “అపి మాషం మషంకుర్యాంచ్ఛందో భంగం నవా" అన్న మాటెరుగుదురా? “అబోధోపహతాశ్చాన్యే" తెగలో వుండే మీకీ వ్యాఖ్యానాలెందుకు? నన్నయ్య బుద్ధిని బాహువిక్రమంగా రూపించాడు కదా? దానికి అనుకూలించడానికి మనం వాహినీపాఠవ కల్పించి గ్రంథపరమైన భారత శబ్దాన్ని భరతవీర చరిత పరం చేద్దామనే అనుకున్నారు. గాని, ప్రధానమైన చిక్కు (ఉ. బాబుకు పెండ్లీ యయ్యెనని బాలుడు సంతసమందె గాని, మేకై బహివెట్టు చెట్టసవతమ్మ ఘటించు టెరుంగడు. గీరతము చూ.) గమనించనేలేదు. "భాష్యాబ్దిః క్వాతి గంభీరః"