పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

528

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విషయాలు ఈసీమవారైన వీరికి యేకొంచెమున్నూ అవగతం కాలేదనుకోవడానికి వీరిశంకలు కొన్ని సాక్షమిస్తాయి. సోదర కవులు కాకినాడనుంచి యెవరో వారి ఆప్తులకు వ్రాసిన వత్తరం అసత్యవాక్య పూరితం అని అసలు వారే వొప్పుకున్నట్లు నాఁటివారి తూష్ణీంభావమే వేనోళ్ల సాక్ష్యమిస్తూ వుండగా ముప్బై యేండ్లకు వీరు ఆవుత్తరమంతా సమర్థించడానికి పూనుకోవడంకన్న ఆశ్చర్య మేముంటుంది? వీరి విమర్శనమంతా యిదే విధంగా ప్రవర్తించింది. దానికి నేను సమాధానం చెప్పడముకంటె ఆ సీమలో ఆ కాలంలో వుండేవారిలో యిప్పటికి స్వర్గతులుకాగా మిగిలిన గ్రంథకర్తగారి బందుగులే చెప్పఁగలరని వారికి బరాతం చెప్పడం యుక్తమని తోఁచింది. ఆ గ్రంథాన్ని మెచ్చినవారిని వీరు“స్తోత్రపాఠకులు కొందఱు ఒళ్లెఱుంగని సివమన్నయట్లు గుడ్డలూడ్చి గంతులు వైచిరి... వీరేమి విశేషములు గాంచి యట్లయిరి. తి. వేం. కవులయందలి దురభిమానమువారి నట్లాడించినది...” అనినీచంగా దూషించి యున్నారు. కాబట్టి అట్టివారు వీరి కేమి బోధించినను అది దురభిమాన ప్రయుక్తమే కాబట్టి ఆ వుత్తరపుతత్త్వం వగయిరాలకు మాకునాఁడు ప్రతిపక్షులైనను ఇటీవల మిత్రులే అయిన సోదర కవులనే సాక్షులుగా చూపుచున్నాను. 116 పుటలలో బోలెడు శంకలుండునుగదా? అన్నిటికి యిదివఱలో నన్నయ్యను ఆదికవిగా పేర్కొన్నందుకు శంకించిన శంకకు వ్రాసినట్లే వ్రాస్తే చాలా పెరుగుతుంది. నిస్సారమైన ఆ యీశంకా సమాధానాలకు లోకం యేకొంచెమున్నూ సుముఖంగా వుండదు. అందుచేత యేపత్రికగాని పరిగ్రహించదు. యీకారణం చేతేగదా? విమర్శకుఁడుగారు తమశంకలను పృథక్కుగా ద్రవ్యము వ్యయించి అచ్చొత్తించుకోవలసి వచ్చింది. నేను కనక సరిపోయిందిగాని వీరుచేసిన అనుచిత ప్రసంగమునకు యితరులైతే యింతతో సరిపోదు. కాని యెన్ని అనుచితపు తిట్లు తిట్టినా విమర్శకుఁడు గారి వుద్దేశము తిట్టవలెననేదికాదనే నా అంతరాత్మకు తోస్తూవుంది. యేలాగో దేశానికి వచ్చిన కళంకాన్ని తొలగిద్దామనేదియ్యేవే. అందుచేత దీన్ని ప్రస్తుతం జర్మనీ లోనైన దేశాల్లోనేకాక మనదేశంలో కూడా సర్వత్రావ్యాప్తిలోవున్న దేశాభిమానం క్రింద జమ కట్టవలసి వుంటుంది. అన్నిటికి మూలం కవిత్వం వకటి సాఫుగా వుంది. యీగుణం నన్ను బాగా ఆకర్షించడం చేతనేనే యీయన్ని నేను సేల్జోడు సమర్పించి బహూకరింపఁదలఁచినాను. యితర - విషయంలో పద్యం సాపుగావ్రాయడమే శ్లాఘ్యం. అందులో పూర్వోత్తరపక్షాలు పద్యంలో సాఫుగా వ్రాయడం మఱీ శాఘ్యం. అందుచే వీరు నాకు అభినందనీయులు. పయిగా కృతిప్రదాతలు. నాసమ్మానము ననాదరింపక దయచేసి త్వరలో సభాముఖమున స్వీకరింతురని విశ్వసించుచున్నాను.

★ ★ ★