పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

453

"అభణపుగాండ్లు - అనునది నిరర్థకపదము" అంటారు స్వాములు. జ్ఞానలవదుర్విదగ్ధత్వాన్ని స్వామివారి యీ వక్కమాటే స్థిరపఱుస్తుంది. దీనిక్కోపమెందుకు? “నిజమాడితే నిష్ఠూరం" కిందికి యిది రాదు కాఁబోలు? యిది "స్వభావోక్తిరసౌచారు" అది నిరర్థకంకాదు. గిల్లికజ్జా తెచ్చుకొని, చేయాడినట్లల్లా వ్రాసేవారి సారం తేల్చడానికే మూలనున్న ఆ పదాన్ని ముంగిటి కీడ్చడం తటస్థించింది. సంప్రదాయజ్ఞులైన శిష్యులున్నారు. అడిగితే వారు స్వాములకు అర్థాన్ని బోధిస్తారు. అది శిరోమణిత్వానికి భంజకమైతే మనవిచేయఁజాలను. వ్యాకరణంలో కొంచెం ప్రవేశముండాలి. అజాదిగాఁ గాకుండా కూడా ఒక త్రోవ వుంది అక్కడ. కాని ఆ పక్షంలో యింకా చిక్కులు కొన్ని వస్తాయి. సారం తేల్చడానికేర్పడ్డ ప్రయోగ మయినప్పుడు ఆ తిరుమంత్ర రహస్యం యిప్పడే అంతా తెలిస్తే యేలాగ? స్వామివారి తుందుడుకు వ్రాఁతకు - అనంగా “దుస్త్యజాహి ప్రకృతిః" వగైరా వ్రాఁతకు తగిన ఫలాన్ని యీ "నిరర్థకపు" పదమే కలిగిస్తుందని మనవిచేసుకుంటాను. యెన్ని గ్రంథాలో వుదాహరించారు ఆచార్లగారు. గురుపాదాలవద్ద చదివితేగాని అవన్నీనా బోట్లకు తెలియవన్నారు. అంగీకరామే. ప్రస్తుత పదానికర్థం కూడా గురుపాద సన్నిధానాన్నే తెలుసుకుంటారేమో? యెందుకింత కర్మం, అన్యబుద్ధి యప్రత్యక్షము కదా? వచ్చినవాదం, వారు "నిరర్థక" మన్న “ఈ యభణపుగాండ్లు" అన్నచోటకాదు, లక్ష్యలక్షణములలో దేనికి యెక్కువ ప్రాధాన్యం అన్నచోట. దానికోసం ముఖ్యమైన మాటలు వ్రాస్తే తీరిపోయేది. దానిలో దీన్నెత్తికోవడం యెందుకు? బోల్తాపడడానికే అని రుజువవడానికే. యింకా యీ ఘట్టంలో “ఢిల్లికి ఢిల్లి" కూడా తప్పన్నారు స్వామి. యేమి సాహసం? యేమి సాహసం? వీరికి సూరన్నగారి 'రోళ్లారోకళ్లం బాడిన కూరుము' లేలా సాధవుతాయోగదా. యింకా “ప్రకాస్తి" ఒకటి వుంది. తర్వాత చూదాం. శాంతం పాపం! లక్షణంకన్న లక్ష్యానికి ప్రాధాన్యమిచ్చి తీరాలి అన్నందుకు పాణిగృహీతపీఠికలో రేఫశకటరేఫలవిషయంలో కూడా కొంత వ్రాసియున్నాను. దానికి వీరేమిచెపుతారో? అందుకే యిటకు దయచేసేటప్పుడు కేవలకవినిగాక కేవలపండితుణ్ణీగాక మాధ్యస్థ్యానికి "పండితకవి’ సహితంగా దయచేయాలని మనవిచేసుకొన్నాను. లక్ష్యలక్షణ విషయంకన్నా వీ రెట్టిహృదయంతో జీవత్కవినైన నాకవిత్వాన్ని పరామర్శించడానికి దిగినారోతేలాలి. సదుద్దేశమే అయితే, రంధ్రాన్వేషణత్వము వీరికి తగులదు. ఆ ఘట్టంలోవుదాహరింపకుండానే స్ఫూర్తికివచ్చి స్వామి వారిని యిప్పుడు 'తందానా' లాడిస్తూవున్న శ్లోకప్రసక్తిన్నీ వుండదు. దురుద్దేశమే అయితే ఆస్ఫూర్తికి తగిలే శ్లోకాన్నే వకమంత్రంగా యేర్పఱచుకొని సపాదలక్షజపం జరిపి తద్దశాంశం తర్పణమున్నూ తద్దశాంశం హోమమున్నూ తద్దశాంశం బ్రాహ్మణ భోజనమున్నూ జరిగించాలా, వద్దా అని ఆచార్యులవారినే అడుగుతాను. చాలగ్రంథాలు యేకరువుపెట్టారు. వాట్లల్లోనుంచి