పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

432

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నాయకునిగాఁ గైకొనుటయే తటస్థింపదుగాన మార్పున కవకాశమేలేదు. కావున నాటకకర్తల కీయాక్షేపణ తగులదు. శర్మగారింకొక వాక్యము నీసందర్భములో వ్రాసియున్నారు. అదియిది -

"... ... ... తాండ్ర పాపయ్య యను వెలమసేవకుఁడొకఁడు దొంగపోటున పొడిచిన ఖూనీకథను మహావీరలక్షణముగల నాటకముగా బ్రదర్శింప బూనుట. ఆంధ్రదేశమందలి నాటకరంగ మరణవార్తగా విబుధులు తలంపవలసియుండును.” . . .

ఈ వాక్యము కూడ నాకునచ్చలేదు. వెలమసేవకుఁడు, అని వ్రాయుటకూడ సమంజసముగాలేదు. కర్మధారయసమాసమో? తత్పురుషమో? అనుసందియము కల్లునట్లు వ్రాయుటయుక్తముగాదు. తాండ్రపాపయ్యగారి నింతకన్న గౌరవముగా వ్రాయుట యొప్పని నేననుకొందును. శూరుఁడను పేరు వంశప్రతిష్ఠనుబట్టి వచ్చెడిదికాదు. ఇఁక దొంగపోటును గూర్చి యతని నిందింపవలెను. కాని అప్పుడంతకన్న నయ్యనమున కవకాశములేదు. "అశ్వత్థామవలె" పాపయ్యగారును కొంతవఱకు సమ్మానార్హులే. ఒకటిమాత్రమున్నది. విజయనగర ప్రభువు సల్పిన యుద్ధము సర్వవిధముల నిర్దుష్టమై న్యాయబద్ధమై యున్నచో, అట్టి ధర్మవీరు నిట్లువధించిన పాపయ్యగారు నింద్యులైన నగుదురు గాని అన్యథాగా పాపయ్యగారు నింద్యులుగారు. ఆయనకు నాయకత్వమును కల్పించిన నాటకకర్తలును నింద్యులుకారని నేననుకొందును. నేనీ బొబ్బిలి చరిత్రను నాటకముగాఁగాని, ప్రబంధముగాఁగాని వ్రాసిన నేఁటికవులలోఁ జేరినవాఁడను గాకున్నను, శర్మగారువ్రాసిన - "విబుధు లాక్షేపింపవలసినపని” “నాటకరంగ మరణవార్తగా విబుధులు తలంపవలసి యుండును." అనెడి వాక్యద్వయము ప్రేరేపించుటచే నించుకనాకుఁ దోఁచినది వ్రాసితిని. ఇఁక నొకటి, నేను బొబ్బిలి పట్టాభిషేకమును వ్రాసియుండుటచే నీ వ్రాఁతకు నది నిమిత్తము కావచ్చునని చదువరు లూహింతురేమో? నేవ్రాసిన చరిత్రకును, ప్రస్తుత యుద్ధమునకును సంబంధములేదు. అందుఁ బ్రసక్తాను ప్రసక్తముగా దొరలిన పద్యములలో నొకటి యుదాహరించియేయుంటిని. ఆఘట్టములోని మఱికొన్ని పద్యములుగూడ నుదాహరించి దీనిని ముగించు చున్నాఁడను.

ఉ. ఇప్పటి బొబ్బిలిం గుఱిచియే యిపుడించుక చర్చఁజేసి నేఁ
    జెప్పితివెన్క బొబ్బిలి విశేషములన్ దిలకింప నొక్క నాఁ
    డప్పురి తూర్పునందు నొకయర్ధపుఁగ్రోశముఁ బోయినార మం
    దిప్పుడు రాతికంబ మొకఁడెత్తయినట్టిది చూడనయ్యెడిన్.