పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీలాపనిందలు

411


చూచి దానిసంగతి ఆలోచిద్దామని గంభీరంగా చెప్పి, మొదలెట్టిన పాఠాన్నే కొన్నాళ్లు సాగించి మఱికొంత చనువు చిక్కిన తరవాత వున్న యథార్థాన్ని తెలిపాను. విశ్వసించాడో, లేదో? చెప్పలేను. అతడు మంచి కవి; ఆశుకవికూడాను. పండిత కవి. పేరు వ్రాస్తే అతడి కేం కోపంవస్తుందో అని దీనిలో వుదాహరించలేదు. మంత్రోపదేశానికి మిష కల్పించుకు వచ్చినవాడేకాని అతడు శిష్యకోటిలోవాడుకాడు. యీ మంత్రోపాసనా ప్రవాద యింతతో ఆగితే కొంత నయమే; ఆగలేదు. యిది “పీత్వా" దాకా డేకింది. అదిన్నీ నా చెవిని బడింది. యేమిటి చేసేది? “కథక్కాళ్లంటూ వుంటాయా?” అనుకొని వూరుకోవలసిందే. జీవితానంతరం యీలాటి కథాకల్పనలు బయలుదేఱడం కొంత సహజమే. జీవితకాలంలోనే బయలుదేఱితే కొంత యుక్తం. ఇవి ఆలాటివారి ద్వారా బయలుదేరినవిగా తోచవు. మొట్టమొదట వీటికి జన్మస్థానం (“ఏఱుల జన్మంబు" అన్నట్టు) యెక్కడో తెలుసుకోవడానికి వశంకాక యెవరో ప్రారంభిస్తారు. వారిద్వారా వీరూ, వీరిద్వారా వారూ దాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. లోకము మూయను మూకుడున్నదే?

తెనాలి రామలింగానికి పెద్దన్న ముక్కుతిమ్మన్న భట్టుమూర్తి యింకా కొందఱూ ఏక కాలీనులు కారని నేటివారు బాగా ఋజువు చేసినప్పటికీ వీరందఱితోటిన్నీ రామలింగానికి ముడిపెట్టి చెప్పకొనే కథలు చెప్పకుంటూనే వున్నారు. ఆలాగే పై నీలాపనిందలు సత్యేతరాలని యెంత గాఢంగా ఋజువుచేసినా చెప్పకొనేవారు చెప్పకుంటూనే వుంటారు. యీలాటి సందర్భాలనుగూర్చి కొందఱు విమర్శకులు కొంత కృషిచేసి తత్త్వ నిర్ణయానికి పాటుపడడం ఆవశ్యకమే కాని ఆ విమర్శకులు అంతతో ఆగక నల్వురూ శిరసావహించే భారత భాగవత రామాయణాల మీదికి కూడా తమ బుద్ధి చాకచక్యాన్ని ప్రసరింపజేసి ఆయా పుణ్యగాథలయందు లోకానికి అవిశ్వాసాన్ని కలిగించడం శోచ్యంగా వుంది. వేదంలో వుండే యితిహాసాలు గాని, పురాణాల్లో వుండే యితిహాసాలు గాని సమస్తమూ అర్ధవాదలుగా (లేని కథలు కల్పించి సత్యం వగైరాలను దృఢపఱచడం పేరు అర్థవాదమంటారు మీమాంసకులు) నిర్ణయించే వున్నారుగాని, వాట్లవల్ల యిట్టి చిక్కురాదు. అది “గజంమిథ్య పలాయనం మిథ్య" వంటిది కనక యెవరికోగాని అవగాహన చేసుకోతగ్గదిగా వుండదని తాత్పర్యం. ప్రతి ప్రసిద్ధవ్యక్తినిగూర్చిన్నీ యేదో నిందా కల్పన వున్నట్టే కనపడుతుంది. సంస్కృత గ్రంథంలో లేని నింద తెలుగు అనువాదంలో కనపడడం వుంది. ద్రౌపదీ స్వయంవరసమయంలో ఆ ధనుస్సు కర్ణుడు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొట్టడానికి సిద్ధపడుతూవుండగా, పాండవులు మత్స్యయంత్రం తెగిపడ్డట్టే తలుస్తూవుండగా (మేనిరే పాండునందనాః) ద్రౌపది “నా౽హం వరయామిసూతమ్” అని నిరాకరించడంవల్ల కర్ణుడు రసాభాసశృంగారమందు యిష్టంలేని