పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

378

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వేఱే వ్రాయనక్కఱలేదు. తి. శా. వాదం ప్రమాణ ప్రమితమా, కాదా అనేశంక యిక్కడ చేయకూడదు. వొక అప్సరస్త్రీని, లేదా భూలోకస్త్రీనే అనుకుందాం -

క. “ఈలలన వేలుపున్ జవ
     రాలో? యచ్చరయెు? కిన్నరవధూమణియో
     వ్యాళాంగనయో? కా కీ
     భూలోకస్త్రీల కిట్టిపొంకము కలదే?”

అని వకకవి వర్ణించాండు. యిక్కడ అందాన్నే చూచుకోవాలి గాని, ఆపెహృదయం యథార్థంగా వుంటుందా, వుండదా అని విచారించడం, దుర్యోధనుఁడి కిరీటంమీఁద వుండే రత్నాలు డుల్లిపోయేటట్టు అర్జునుఁడు బాణాలతో కొట్టాడంటే అప్పుడు ఆరత్నాలు యెవరు యేఱుకున్నారని అడిగే ప్రశ్నవంటిది.

అతని బుద్ది పాదరసంవంటిది. అది దేనిలో పడితే దానిలో పనిచేసేది అనేదే మనకు కావలసింది. నేనీమాట అభిమానంచేత వ్రాశానని అనుకోవడానికి అవకాశంలేదు. యీ మాట మాగురువుగారిది గాని నాది కాదుగదా! పైఁగా స్వశాఖీయుణ్ణి నేనుండఁగా అన్యశాఖీయుణ్ణి ఆలా పొగడడానికి అసూయపడవలసింది. అట్టిస్థితిలో వారి వాక్యాన్ని నేను అనువదించడంలో నాఅంతరంగాభిప్రాయం విస్పష్టమే కనక విస్తరించేదిలేదు. నాయందుకూడా అతనికి యెంతోగాఢమైన గౌరవం వుండేది. దాని ఫలితాన్ని పొందే అదృష్టం నాకు పట్టలే దనికూడా నేను ఆ సానుభూతిసభలోనే ఒక పద్యంలో సూచించాను.

మ. "మృతులంగూరిచి యేడ్చుపద్యములు నేనేనాఁడుఁ జెప్పన్ మహా
      మతి! యో తిర్పతిసత్కవీ! త్రిజగతీ మాన్యాత్మ విక్టోరియా
      సతి మున్నౌమృతు లెల్ల నీకతననే స్వర్గం బధిష్టించి రే
      నతిపాపాత్ముఁడ నాకు నీకతన లేవాలాటిసౌభాగ్యముల్."

నన్నుఁగూర్చి అతఁడే సానుభూతిసభలో విచారాన్ని వెలిపుచ్చ వలసివస్తే యేవిధంగా వెలిపుచ్చేవాఁడో . యిప్ప డేలా తెలుస్తుంది? ఆభాగ్యం నాకు పట్టింది కాదని నేను విచారించడం అయుక్తం కాదుకదా! అయితే ఆ విషయం మాత్రం కొంత సూచించడం మాత్రం జరిగింది. అట్టిదాన్ని ఒకదాన్ని వుదాహరిస్తాను.

ఉ. “చుక్కలు రాలలేదు రవిసోముల పోకడ మాఱలేదు న
    ల్దిక్కులు కూలలేదు జలధిజ్వలనం బుబుకంగలేదు నేఁ
    డక్కట రామకృష్ణకవు లర్భకు లేగతిఁ జేయనేర్తు రా
    ధిక్కృతవైరి వేంకటసుధీకవిమౌళికి శృంగభంగమున్?”