పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

363


అతని సమాసప్పోకడ యేలా వుంటుందో దీనివల్ల కొంత తెలుస్తుందా? అయినా యింకొకటికూడా వుదాహరిస్తాను.

చ. “గరువము మాటలందుఁ జెలఁగన్ జగమెల్లఁ జరిపఁజాలు ద్రి
     మ్మరితన మేకవీంద్రులకు మైకొనజాలు నిరర్గళాద్భుతా
     కరరసపుంజ మంజుల వికస్వర చారుకథా సుధాధురం
     ధరబహుళ ప్రబంధ కవితా వనితా చతురోక్తి లేనిచోన్"

యివి రెండూ సమాసధోరణినేకాక విడిపదాలకూర్పునుకూడా తెలుపుతాయి. ఫలానావారి కవిత్వమని చెప్పకుండా వుండేపద్ధతిని యే నన్నయ్యభట్టు కవిత్వమో అనే భ్రమను కలిగించితీరుతుందో, లేదో పయిధార విజ్ఞులు విచారించడానికి అర్హులు. నన్నయ్యగారి పద్యంకూడా వకటి వుదాహరిస్తున్నా

చ. “జలధివిలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ
     తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ
     ద్దళదురుఘర్మవారికణ కమ్రకరాబ్జము వట్టి నూతిలో
     వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్."

యీ వుదాహరించిన నన్నయ్యగారి పద్యంగాని, తిరపయ్యగారి పద్యాలు రెండూగాని కేవలమూ పద్యమంతా యేకసమాసంగా వున్నవి కావు. అట్టివి యెన్నో వుభయులవీ వుంటాయి చూచుకోండి. ఉన్నప్పటికీ నేను వీట్లని వుదాహరించడానికి కారణం యేమిటంటే, జవాబు చెప్పలేను. చెప్పకపోయినా విజ్ఞులు తెలుసుకుంటారు. చెప్పినా తెలుసుకోలేరు తదితరులు. అందుచేత “మౌనవ్రతాలంబినః”. యిఁక నా రచనల్లో నుంచి కూడా ఒకటిరెండుదాహరిస్తాను. - -

శా. "బాలమ్మన్యులపోరు కీర్తికరమో? ప్రాగల్భ్యసందర్భమో?
      శీలాలంకృతియో? భవత్సుకవితా సీమంతినీ చారులీ
      లాలాస్యాసుగుణంబొ? యేమిపనికై లాభించునో? తెల్పు మీ
      యాలం బింతటఁ జాలుcజాలు నింక నే లా తూలికాచాలనల్?

మ. మొనగాఁ డొక్కరుఁ డారుమాసములు సామున్ జేసి మార్మూలఁబం
     బిన భీపెంపున డాఁగియున్న ముసలాపెన్ బోరికిన్ జీఱులా
     గునఁ గూపస్థితదర్దుర ప్రకర దుర్గోష్ఠీ విరావార్భటీ
     జనితాహంకృతిశాలివై పెనఁగు టే చందంబు నీబోఁటికిన్?"