పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

337


గురువుగారు సొంత ద్రవ్యంతో నవరాత్ర ప్రారంభం చేశారు. వెళ్లింది మొదలు గురువుగారి దగ్గఱ మాతగవు ప్రారంభమయింది. వారు శాస్త్రాలల్లోనే కాని యీలాటివిషయాలు ఆదరంగా చూచేవారు కారు.

అందుచేత యెవరికీ అనుకూలించేమాట చెప్పక “యిందులో యేముంది? పోనిస్తురూ, స్నేహంగా వుండి చదువుకోండి, బాగుపడండి" అంటూ సబోరీమాటలు చెప్పేవారు. అందుచేత తగవు తగవులాగే వుండిపోయింది. (కాని పరశురాముణ్ణి దాతృత్వానికి వుపమగా తీసుకోవడం కవిసమయసిద్ధమే. చెప్పడం మొదలెడితే ప్రయోగాలు బోలెడున్నాయి) మళ్లా మాట్లాడుకుంటూనే వుండేవాళ్లం. యితరులతో వాదాలు మా కిటీవల తటస్థిస్తూవచ్చాయి. కాని మొట్టమొదటినుంచీ మాలో మాకే వాదాలు యెప్పుడూ పడుతూవుండేవి. అప్పుడు విరోధంవచ్చి శంకించాఁడుగాని స్నేహంగా వుండి గ్రంథరచనచేసే రోజుల్లో కూడా అడ్డదిడ్డశంకలు చేయడం తి. శా. కి అలవాటు. “కాదన్నవాఁడు కరణం" అన్నట్లు శంకించడమే అతనిపని. దీన్నిగుఱించి వ్రాస్తే యెన్నో వ్రాయాలి. మే మిద్దఱమూ కలసి, క్షీరనీరన్యాయంగా రచన సాగిస్తూ వున్న రోజుల్లో జరిగిన వక సందర్భంమాత్రం వుదాహరిస్తాను. ఆత్మకూరు సంస్థాన గజారోహణోత్సవానికి హేతుభూతమైన శ్రీనివాసవిలాసాన్ని ఆంద్రీకరించడాన్ని గూర్చి చాలా సంగతులు నానారాజ సందర్శనంలో చదివే వుంటారు చదువరులు. అక్కడ పండితులతో మొట్టమొదట విద్యావివాదం జరిగిన పిమ్మట ఆ రాజుగారు మా శక్తి తెలుసుకొనే తలఁపుతో ఆంద్రీకరణానికి గ్రంథం యిచ్చి ఆరు మాసాలు మాత్రమే గడువు యిచ్చారు. మంచిదని వొప్పుకొని దేశానికి వచ్చేశాము. “యీ భాగం నీవంతు, యీ భాగం నావంతు" అని గ్రంథాన్ని ఆంద్రీకరణ విషయంలో తోవలోనే విభజించుకొని యెవరి గ్రామానికి వాళ్లం ప్రవేశించాము. యిఁక 15 రోజులలో కృతి యివ్వడానికి ప్రయాణ మనఁగా యిద్దఱమున్నూ కలుసుకొని, పిఠాపురంలో శ్రీవాడ్రేవు వేంకటరత్నంగారికి అతిథులుగా వుండి ఆదరించఁబడుతూ వారి పెరట్లో వున్న దివాన్ బంగాళామీఁద కూర్చుని సాపువ్రాఁత కుపక్రమించాము. యెప్పుడూ నేను స్వహస్తంతో వ్రాసుకోవడమే గాని యెవరిచేతా వ్రాయించడం అలవాటులేదు. యీ రోజు వఱకున్నూ వోపిక లేకపోయినా, చేయి వణుకుతూ వున్నా ఆలాగే జరుగుతూ వుంది. అతని దస్తూరీకూడా వీలైనదే అయినా శ్రద్ధగా వ్రాయఁడనే కారణంచేత అతఁడు చెపుతూవుంటే నేను వ్రాయడమే జరుగుతూ వుంది. యేవో శంకలు చేస్తూవుంటే, సమాధానం చెపుతూ వ్రాస్తూవున్నాను. ఒక్కొక్కశంక మఱీ తలతిక్కగా వుండేది. వున్నాసరే వోపికపట్టి సమాధానం చెపుతూ వ్రాస్తూవున్నాను. రాజుగారి వంశ వర్ణనదాఁకా గ్రంథం సాపువ్రాయడం జరిగింది. ఆరంభంలో వక పద్యంలో