పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

315

మీ ముత్తాతగారి నాటికి మాకు గ్రామంలో పౌరోహిత్యం వుండేదట. నరసకవిగారి అన్నగారు అన్నయ్యగారు దాన్ని చూచేవారట. ఈయనకి ప్రాజ్ఞతవచ్చిన తర్వాత పట్టుబట్టి దాన్ని మానిపించి దానికిగాయేర్పడ్డ మడిమాన్యాలసహితం పొన్నావారనే యింటిపేరుగల వారికి వశం చేయించినారట. ఇప్పటికిన్నీ ఆ పౌరోహిత్యం వారే నిర్వహిస్తూవున్నారు. దీన్నిబట్టికూడా ఈయన “నప్రతిగ్రహీత" అని తేలుతుంది. అయితే యిక “తేభ్యమెక్కడ తెత్తునయ్య? తెల్లవారింది" ఎట్లా జరిగేదంటే : పెద్దన్నగారు కామయ్యగారున్నారే, వారు మెరకపొలం యావతూ స్వంతకృషిచేసి బాగా జొన్నలు పండించేవారట. ఇప్పడా భూమి అంతా అంటూమామిళ్లమయమై యున్నప్పటికీ, పూర్వప్పేరు జొన్నపొల మవుటచే ఆపేరు పోనేలేదు. జొన్నపంట వున్నచోట పాడివుండుట ప్రసిద్ధమే. ఇక నేంకావాలి? పాడిపంటలకు లోటులేదు. కూరనారల కంతకుముందే లోటులేదు, తక్కిన షోకుల కప్పటివాళ్లలవాటు పడేవారేకారు. మా ముత్తాతగారు స్వేచ్ఛగా కవిత్వం చెప్పకుంటూ, వచ్చిన శిష్యులకు పాఠాలు చెపుతూ, యెప్పుడో మనకు వస్తుందనుకునే స్వరాజ్యం అప్పుడే చేసుకుంటూ హేలగా కాలక్షేపం చేసేవారట? పొలంలోకి వెళ్లేవారేకారట. యెప్పుడేనా వెళ్లినా పుస్తకాల నిమిత్తం తాటాకులు కొట్టించుకునే నిమిత్తం తప్ప వ్యవసాయప్పనికి అన్నగారికి లేశమున్నూ సాయపడడం లేనేలేదట, పాపం! ఈయన ముందు బయలుదేరేవాళ్లకోసమని పుస్తకాలకు పనికివచ్చే రకం తాటిచెట్లు అయిదాఱు వందలదాకా పాతించారు. అవి యిప్పుడు చాల పెద్దవై వృద్ధాప్యంలో వున్నాయి. ఈ కాలంలో వాటి వుపయోగం లేకపోయింది.

అయితే పైరీతిగా ఆయన బొత్తిగా గృహకృత్యానికి సాయపడకుండా భోజనవేళకి "పాత్రేసమితుడు"గా సిద్ధపడడానికి అన్నగారికి లేశమున్నూ కష్టంగా తోచకపోయినా, వదినగారు సరమ్మగారికి యిబ్బందిగా వుండి, ఒకరోజున గట్టిగా కంకడానికి మొదలు పెట్టేటప్పటికి, మా ముత్తాతకవిగారికి కోపంవచ్చి, మిట్టమధ్యాహ్నంవేళ సకుటుంబంగా గ్రామాంతరానికి ప్రయాణం కడుతుండగా, ఆ వీధి వెలమశిష్యులు బతిమాలి ఆపుచేసి. అప్పుడే వక పెద్దస్థలం యిచ్చి, తక్షణమే దానిలో పర్ణశాలవేసి, వంటచేసుకొనేటట్టు చేసేరట, ఈయన స్వార్జితం ఆ స్థలం మాత్రమే కనపడుతుంది. ఇప్పుడా స్థలం మూ పినతండ్రిగారి కుటుంబం వారిక్రింద వున్నది. వదినగారి కారణంచేత ఈయన అన్నగారితో విడిపోయినట్టయింది. అన్నగారియందు మిక్కిలి భక్తితోనే యిటీవలకూడా వున్నట్టు వేంకటేశ్వర్రవిలాసంలోని యీ పద్యంవల్ల తెలుస్తుంది.

క. కామయనామసుధీమణి
   భూమిం గడునింపెసంగ భూతదయార్థ్ర
   శ్రీమహితుండనఁగను బర
   భామావిముఖవ్రత ప్రభావుండనఁగన్.