పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

35


కర్మిష్ఠిగాని కాఁడుగాని మా పెద్ద వియ్యంకుడు అంటే మా పెద్ద చిరంజీవిమామగారు పైని వుదాహరించిన రామశాస్రుల్లుగారితో పాటు తాంబూల చర్వణాదులు జరుపుకోవడమే కాకుండా పగలు నిదుర పోవడంకూడా మడిగట్టుకునే పోతూవుంటాండు. ఆహార విషయంలో యితరశాఖలకన్న వైష్ణవులలో చాలా కట్టుబాటువుంది. తక్కిన సదాచారాలు వారిలో చాలా మృగ్యం అంటే తప్పలేదు. దీనిక్కారణం నిజాందేశం తిరిగేటప్పుడు గోచరమయింది. ఆదేశంలో దృష్టిదోషం బొత్తిగాలేదు. రాజసంస్థానాలలో సంతర్పణలు జరుగుతూన్నప్పడు రాజుగారుగాని, రాజబంధువులుగాని విస్తళ్లువేసే పర్యంతమున్నూ పంక్తులలోనే తిరుగుతూ వుంటారు. వడ్డన అయ్యే సమయానికి అక్కడ నుంచి తప్పకుంటారుగాని యెదురుగుండా వుండి "యేమండోయి మీరింకో రెండు లడూలు వేసుకోండి" అంటూ హెచ్చరిస్తూ వుంటారు. వైష్ణవులీ కారణంచేతే కాcబోలు తెరవేసుకోవడం మొదలెట్టారని ననుకున్నాను. ఆ దేశంలో మేము వంటచేసుకుంటూ వుండంగా వక శూద్ర స్త్రీ ఆ చోటికే వచ్చింది. యిదేం కర్మం, వంట చేసుకునేచోటికి వచ్చావంటే జవాబు చెప్పిందికదా : "యేమయ్యోయి! నీవేమేనా శ్రీవైష్ణవుండవా? రాకపోవడాని"కంది. కథ కంచికే వెడుతూ వున్నట్లుంది ప్రస్తుతానికి వస్తాను. రాజావారు మామిడి పండ్లు కోసి తినమంటే తినకపోతే ఆ చాకుతో యేం మర్యాద చేస్తారో కదా అని భయం. పోనీ తినేసివేద్దామంటే తీరా తిన్న తర్వాత “ఏం బ్రాహ్మలయ్యా? యొక్కడపడితే అక్కడే తింటారా?" అని ప్రశ్నిస్తే యేం జవాబు చెప్పేదిరా భగవంతుడా అని సందేహమాయె. సేయ ముభయతః పాశారజః" తుట్టతుదకు రాజావారి వార్షికంతో ఫలహారాన్ని కూడా స్వీకరించి యేలాగో యీవలపడి తల తడివి చూచుకున్నామంటూ మా గురువుగారు బ్రహ్మయ్యశాస్రుల వారితో ఆ పండితులే చెప్పేటప్పుడు విన్నాను. యీ చెప్పడంలో యే స్వల్పమో కల్పితం వుంటే వుందేమోకాని అసలు తమామున్నూ కల్పితంకాదు. ఆ రాజావారి లక్షణం కాళిదాసుగారు వర్ణించినట్లు “అధృష్యశ్చాభిగమ్యశ్చ" అనే తరగతిలో వుంటుంది. కాని అభిగమ్యత్వంకన్న అధృష్యత్వమే ప్రధానం. వీరి సన్నిధానంలో వక్కపొక్కునూరి వేంకటశాస్రుల్లుగారు వినాగా నిర్భయంగా మాట్లాడినవారే లేరని నా వినికి.

దండిభట్ల విశ్వనాథశాస్రుల్లుగారు వీరి దర్శనానికి వెళ్లినప్పడొక చిత్రం జరిగిందట. రాజావారికి సంస్కృతంలో మంచి శ్రుతపాండిత్యం వుందని యిదివఱకే వ్రాసివున్నాను. అందుచేత రాజావారు యేలాటి పండితులు దర్శనానికి వచ్చినా వారితో సంస్కృతభాషతోనే మాట్లాడే ఆచారం. ఆ ఆచారాన్ని బట్టి సదరు విశ్వనాథ శాస్రుల్లుగారితోకూడా సంస్కృతాన్నే ప్రసంగించడానికి ఆరంభించేటప్పటికి ఆ తృణీకృత బ్రహ్మపురందరుఁడన్నాండంట : 'రాజా,