పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/288

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

292

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యీ పద్యార్ధాన్ని విని శ్రీ రాజావారు “సరే దాక్కుందనుకోండి యిప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో జడను పట్టుకోవడం ఆయా సమయాల్లో తప్పిందా?” అని ప్రశ్నించారు. దానిమీఁద “అయ్యా! కవిత్వ మంటేనే అబద్ధం. దానిలోవున్న నిజం చాలాలోఁతులో వుంటుంది. ఆ నిజాన్ని గ్రహించేవారు క్వాచిత్కంగా వుంటారు. సెలవైతే యింకో అబద్ధం ఆడమంటే ఆడతాము" అన్నాము. రాజావారు రసికులు గనుక, “చాలును సంతోషించా" మన్నారు. అసలు యీ ప్రశ్న యిప్పటి నైజాంగారి తండ్రి మహబూబుపాదుషా (యీయనకవి) సంస్థాన కవులనేమో అడిగివున్నారఁట : వారు వురుదులో పూర్తిచేశారఁట! అదికూడా మా రచనతో సరిపోయి వుందఁట! ఆశువులో యిట్టిరసవిషయాన్ని చకఁగా సమర్ధించి నందుకు రాజావారు ఆనందించారు. ఇది విషయాంతరం. ఆయా సంస్థానాల్లోయేమి, అవధానాల్లోయేమి చెప్పిన మాపద్యాలనుగూర్చి యీలాటి పూర్వోత్తర సందర్భాలు యెన్నోవ్రాయవలసి వుంటుంది. యింతకూ తేలిందేమిటంటే? కవిత్వం అంటే ఆహ్లాదానికి పుట్టింది. ధర్మశ్త్రాన్ని పురస్కరించుకొని ప్రవర్తిస్తుందనుకో కూడదు. అలాగే అయితే శకుంతలా దుష్యంత సమాగమం మహాభారతంలో మాట అలా వుండనివ్వండి. అది యథార్థకథనం గనక తప్పులేదనుకుందాం. కాళిదాసు గారు ఆ అనౌచిత్యాన్ని సవరించాలంటే? సవరింపవచ్చునుగదా! యెందుకు సవరించలేదో? మిట్టమధ్యాహ్నమే సమాగమాన్ని చిత్రించడమేమో? ఆలోచించండి. ధర్మశాస్త్ర, వైద్య శాస్త్రాలకు విరుద్ధ మన్నమాట కాళిదాసెఱఁగఁడనుకోవడంకంటె పామరత్వం వుంటుందా? అక్కడ సమాధానం శృంగారరసానికిన్నీ ధర్మశాస్త్ర, వైద్యశాస్త్రవిరోధానికిన్నీ లేశమున్నూ సంబంధం లేదనియ్యేవే. యింకా యిలాటి వెన్నో వ్రాయవలసి వుంటాయి. మొత్తం కవిత్వంలో వుండే ఆరోపణలు పుచ్చుకొని వరుస వావులు నిర్ణయించడం పామరత్వంలోనే చేరుతుం దన్నది ముఖ్యాంశం. ఆ అభిప్రాయంతోనే నేను ఆ విషయం యెత్తుకున్నాను. శ్రీ పురుషోత్తంగారు నాకన్నా బలవత్తరమైన స్థలాన్ని యిచ్చివున్నారు. యింకా బలవత్తరమైనదాన్ని నేను వెదికి యివ్వడం యిక్కడ అవసరంకాదు. మొత్తం యిలాటిచోట కావ్యార్ధగ్రహణం చేయడం యిలా కాదని తెల్పడమే మావుభయుల తాత్పర్యమున్నూ ఆవలివారిజ్ఞానం యెంతో పరిశీలించి మఱీ పూర్వపక్షం యెత్తాలి. అందుకే నేను ఆ వ్యాసం వుపక్రమించాను. దాన్నే శ్రీయుతులు బలపఱిచారు. అంతే కావలసింది. దీన్నిబట్టి వెఱ్ఱి వెఱ్ఱిగా కావ్యార్ధాన్ని గ్రహించేవారు వారివారి అభిప్రాయాలు మార్చుకోవడమే మాయిద్దఱికిన్నీ కావలసింది.

“కోవేత్తి కవితాతత్త్వ మీశ్వరో వేత్తివానవా" అనే శ్లోకార్థం బాగా తెలుసుకొనిగాని, యేవిమర్శకులుగాని మహాకవుల కవిత్వాలజోలికి పోకూడదని నాతాత్పర్యం. మురారి మహాకవికి అర్థవిషయంలోకన్న శబ్ద విషయంలో చాలా పట్టుదల వుండడంచేత కాఁబోలు!