పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

శ్లో. “హరేః కుమారో౽పి కుమారవిక్రమః" (55 శ్లో)

యిందులో మొట్టమొదట వున్న "హరేః" (దేవేంద్రునియొక్క) అనేపదం దగ్గిఱవున్న కుమారశబ్దంతో అన్వయించడం యుక్తంగాని, యొక్కడో దూరంగా మూఁడో చరణంలో వున్న “భుజే" అనేసప్తమ్యంతంతో అన్వయించడం యుక్తంకాదు. "పాఠక్ర మాదర్థక్రమో బలీయాన్" అనే న్యాయాన్నిబట్టి ఆలాఅన్వయిస్తామే అనుకున్నా దూరాన్వయదోషం తగిలి తీరుతుంది. కనక విస్తర మనవసరం. న్యాయంగా "హరేః" అన్న దాన్ని దగ్గిరగావున్న “కుమార" శబ్దంతో అన్వయించేయెడల రఘుమహారాజు దిలీపుని సంతానం కాక దేవేంద్రుని సంతనాం కావలసి వస్తుంది. దానితో సుదక్షిణాదేవి అహల్యవంటిది కావలసివస్తుంది. దానితో లోఁగడ సుదక్షిణాదేవికి ద్వితీయస్సర్గలో కాళిదాసువాడిన - "అపాంసులానాం ధురికీర్తనీయా" అన్న విశేషణం 'నేతిబీరకాయ' కావలసి వచ్చి కాళిదాసు గారికి స్వవచోవ్యాఘాతం తటస్థిస్తుంది. విజ్ఞులు విచారించవలసివుంటే విచారింతురుగాక-

శ్లో. "శరేణ శక్రస్య మహాశనిధ్వజమ్" (56 శ్లో)

యిందులో రఘుమహారాజు దేవేంద్రునియొక్క అశనిధ్వజాన్ని అంటే వజ్రాయుధ రూపమైన జెండాను బాణంతో కొట్టినట్టుగా కవి చెప్పి వున్నాఁడు. కాని అక్కడ 'శనిధ్వజం' అనే అర్థం ఝడితి స్ఫూర్తి కలిగి వుంది. దేవేంద్రుఁడి ధ్వజంమీఁద శని వుండడంవల్లనే రఘుమహారాజుకు లొంగిపోయినాఁడనే అర్ధాన్ని కలిగిస్తూ ఉండడంచేత రఘుమహారాజు పరాక్రమానికి రాఁదగ్గంత గౌరవం రాకపోవడమే కాక యింకా చాలా దోషాలు ప్రసక్తిస్తాయో? లేదో విజ్ఞులు విచారించాలి.

శ్లో. “సుదక్షిణాసూను రపి న్యవర్తత" (67 శ్లో)

యిందులో దిలీపపుత్రుఁడని చెప్పక తల్లిపేరు చెప్పడం లోఁగడ వుదాహరించిన దోషాన్ని కొంతబలపఱచినట్టయిందో? లేదో? విజ్ఞులు విచారించవలసివుంది.

శ్లో. “మనుప్రభృతిభి ర్మాన్యై రక్తా (7 వశ్లో 4 సర్గ)

యిందులో రఘుమహారాజుచే పరిపాలింపఁబడుతూవున్న భూదేవి యిదివఱలో యితని పూర్వులచే పరిపాలింపఁబడ్డప్పటికీ యితని విషయంలో కొత్తదానివలెవుంది. అని వర్ణించాఁడు. పూర్వుల పరిపాలనకంటే కూడా యీతని పరిపాలన చాలా బాగావుందనే తాత్పర్యంతోటే కాళిదాసు పైశ్లోకాన్ని వ్రాసి వున్నాఁడు, కాని, స్త్రీలింగసారస్యం వల్ల రాజుకున్నూ, భూమికిన్నీ భార్యాభర్తృభావం ధ్వనించడానికి లేశమున్నూ అభ్యంతరం లేదు కనక తన తండ్రి మొదలైనవారిచే అనుభవింపఁబడ్డ స్త్రీనియ్యేవే తానున్నూ