పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

281



వికటవిమర్శనం

కవుల కవిత్వాన్ని గూర్చి విమర్శించడం ఏలా వుండకూడదో తెల్పితే, యేలా వుండాలో తెల్పినట్టే అవుతుంది. కనక దాన్ని గురించి నాకు చేతనైనంతలో కొన్ని మాటలు వ్రాస్తాను. అయితే యీ విషయం చిరకాలంనాఁడే “అపూర్వ కవితా వివేచనం” అనే పేరుతో మాచేత తెల్పఁబడింది. యింకా కొన్ని వ్యాసాలలో కూడా తెల్పఁబడి వుంది. ఆకారణంచేత చర్వితచర్వణప్రాయమే అయినప్పటికీ, కవిలోక మూర్ధన్యుఁడైన కాళిదాసు గారి కవిత్వాన్ని గూర్చి వ్రాయడం గనక కొంత నూతనంగానే వుంటుందనుకుంటాను. యెందఱో కవులు యెన్నో కావ్యాలు వ్రాసినా కాళిదాసుకు వచ్చిన పేరుప్రతిష్ఠలు యెవ్వరికిన్నీ రాలేదంటే కాదనే వారెక్కడా వుండరు గదా! ఆ పేరుప్రతిష్ఠలకు కారణం ఏమిటో తెలిసిన వారు లోకంలో చాలా తక్కువగానే వుంటారు. నామట్టుకు నాకు నిన్న మొన్నటివఱకున్నూ కాళిదాసు కవిత్వం కంటే కూడా మణికొందఱు కవుల కవిత్వమందే ప్రీతివుండేది. కాని యెందఱో ప్రాజ్ఞులు మెచ్చుకొన్న కాళిదాసు కవిత్వాన్ని మెచ్చుకోకపోతే అవమానం వస్తుందనే భయంచేత నేను ఎక్కడా అన్యథాగా ప్రచారం చేసేవాణ్ణికాను. నేను మెచ్చుకొనే కవిత్వాలు యేలా వుండేవో? కొంచెం మచ్చుచూపి మఱీ ప్రస్తుతం వుపక్రమిస్తాను.

శ్లో. “ప్రాతరంబుజవిడంబిలోచనాం
     మాతరం త్రిజగతా ముపాస్మహే
     శీతరమ్య కరుణావలోకనై
     ర్యా తరంగయతి మంగళాని నః"

యీ శ్లోకం శ్లేషయమక చక్రవర్తి శ్రీ వేంకటాధ్వరి లక్ష్మీసహస్రంలోనిది. యిందులో ప్రాతర మాతర శీతర యాతర అని యెంతో శ్రవణానందంగా నాలుగు చరణాలలోను వుండడం నాకు చాలా శ్రవణా నందంగా వుండేది. కాళీసహస్రంలో యీ మాదిరి కవిత్వాన్ని చెప్పడానికి కొంత ప్రయత్నించడం కూడా జరిగింది. యెంతవఱకు కృతార్థత్వం కలిగిందో చెప్పలేను. మొట్టమొదట సంస్కృత కవిత్వానికి ఆరంభించినప్పుడు కాళిదాసుగారి

శ్లో. "ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా"

అన్న శ్లోకాలను వరవడిగా పెట్టుకొని మేము