పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పద్యంలోవున్న శాపానికి యేకొంచెమో అపరాధం ఆవలి వారి (తల్లాప్రగడవారు) వల్ల కనcబడుతుంది. పెద్దాపురం విషయంలో అట్టి అపరాధం లేశమూ వున్నట్టు లేదు. రామకవిగారు వార్షికం పుచ్చుకువెళ్లి మళ్లా వెంటనే (నెలకో రెండు నెలలకో అన్నమాట) రావడానికి చెప్పుకొనే మాటలు విమర్శించడానికి అర్హంగా వుండవు. ఉదార హృదయులకు బొత్తిగా రుచించవు కూడాను. అయినా ప్రధానాంశమైనశాపానికీ వాట్లకూ లంకెగా వుండడంవల్ల వుదాహరిస్తాను. రామకవిగారికి వేశ్యాసంపర్కం వున్నట్లు

(1) భూతలమందు ధాతకు నపూజ్యత గల్లెను.

(2) చూడఁగ నల్పుగాని పరిశోభిత దివ్యకురంగనాభి.

(3) పెండెలనాగి చెక్కులను పెద్దికటిస్థలి గంగిగుబ్బ చన్గొండల

అనే పద్యాలు ధ్రువపరుస్తాయి. యీ మూగురు సానులలో నొకదాని నివాసం తుని. ఆపెనేమో బంధువులు "నీవేమో నేనమ్మాతురగారామ కవిగారి సానినని విఱ్ఱవీఁగుతావు! నీకేమేనా పాయకరావుపేఁట సేలువులు కప్పివున్నారా? (పాయకరావుపేట తునికి మైలులో వుంటుంది. ఆకాలంలో సేలువులకు ప్రసిద్ధి) లేకపోతే పెద్దాపురం మహారాజావారి కైజారుపిడిమీఁద వుండే రత్నాలు తెచ్చి నీ సవరపు కొప్పెమీఁద తాపడం చేయించారా?" అని యెత్తిపొడిచే టప్పటికి ఆ అనాత్మజ్ఞురాలు ప్రియుణ్ణి, ఆ రత్నాలు తెస్తావా? చస్తావా? అని పట్టుపట్టి కూర్చుండేటప్పటికీ రామకవిగారు తప్పని విధిచేత వార్షికం తెచ్చుకున్న అచిరకాలంలోనే, పెద్దాపురం వెళ్లవలసి వచ్చిందని చెప్పుకుంటారు. కైజారులో వుండే మాణిక్యాలు వూడదీయించి కవిగారికి సమర్పించడంచేతనే మనమడి తరందాఁకా రాజ్యం ఆగినట్టున్నూ చెప్పుకుంటారు. ఆ యీ శాపప్రదానానికి హేతువు అంతగాని కొంతగాని సరిగా కనపడదు. దీనికే కాదు, పౌరాణిక శాపాలలో కూడా నూటికి తొంభైవంతులు యీలాగే వుంటాయి. యీమాదిరి యాచకులను మనం, భిక్షాటకులుగా విశ్వసించడం యేలాగ? యిస్తే పుచ్చుకోవడమూ, యివ్వకపోతే చక్కాపోవడమూ 'భిక్షకుల' లక్షణం. (అవమానం పురస్కృత్యమానం కృత్వాతు పృష్ఠతః చూ.)

అదిన్నీ కాక యేదో “నిజదార సుతోదర పోషణార్థం" బియ్యమో, వడ్లో, జొన్నలో? అథవా రొక్కమో? అయితే భిక్షాటనంగా భావించడానికి అవకాశం వుంటుంది, గాని నా సానికి పూయడానికి కస్తూరి కావాలి, నాసాని సవరపు కొప్పెలో చెక్కించడానికి రత్నాలు (ఆ రత్నాలుకూడా అలాయిదాగా యిస్తే వల్లకాదు) మీ కైజారుపిడిలో వున్నవి కావాలి, అనే భిక్షాటనం భిక్షాటన మవుతుందా? “నమ్మిన నమ్మకున్న నది నా వశమా?" అన్నారు దాసువారు. నే విన్నమాటలు వ్రాశాను, కథలకు కాళ్లూ ముంతలకు చేతులూవుండవు.