పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామెతలు

209


కొట్టడంగాని, తుదకు బెదిరించడంగాని, చేయకుండా, చక్కాపోతాఁడని స్ఫురిస్తుంది. దీనిక్కారణం ఆ మొఱిగేవి కుక్కలు అవడమే! అనఁగా? తత్తుల్యమైన మనుష్యులు యెన్ని నీచపు మాటలు వినియోగించినా, గౌరవ భాజనంగా ఉండేవాళ్లు తూష్ణీభావము వహించడమే యుక్తంగానీ వాళ్లతో మాటకు మాటగా జవాబు చెప్పరాదని, ఫలితార్థం. యిలా చెప్పకపోతే స్పష్టంగానే నీచులు తన్నెంత దూషించినా ఘనులు ప్రతి చెప్పరు అనే అనఁగూడదా? అంటే, వినండి కవిత్వానికి వాచ్యంకంటే వ్యంగ్యమే ముఖ్యం (అఱవెత గుబ్బచన్వలె, చూ.) అందులోనే అందంవుంటుంది. బట్టవిప్పేసినట్లుంటే రసం లేదు.

“జీవితం వ్యంగ్య వైభవమ్" అన్నారు సహృదయులు! కవిత్వ పదార్ధం లోకోక్తులలో విస్తరించి వుంటుంది. ఆ వ్యంగ్యంలో ఉత్తమ మధ్యమాధమత్వాలున్నాయి. ఆయీ విషయం వ్యాఖ్యానించ వలసి వస్తే చాలా పెరుగుతుంది. సామెతలు వాడడంలోనే కవిత్వానికి జీవభూతమైన వ్యంగ్యం బాగా స్ఫురిస్తుంది అని తెలిసికొందాం. ఉ. కుక్కలు కూసికోఁ జెడునొకో మఱి జంగము పర్వు - మొట్ట మొదట హెడ్డింగుగా వుంచిన సామెతనే గ్రాంథిక భాషలో మాఱిస్తే ఆయీ విధంగా తేలింది. మఱి అనే పదం అధికంగా చేరింది. కొన్ని సామెతలు కవులు యథాశ్రుతంగానే వాడుకున్నారు పాలు విఱిగితే పెరుగగునే? వగయిరాలు యీ ప్రకారం వాడేటప్పుడు వ్యాకరణ ప్రకారం తప్పొప్పులు పట్టకూడదు. అనుకరణం లేకపోయినా వున్నట్టే. ఆయీ విషయం పలుచోట్ల నాచేత వ్యాఖ్యానింపఁబడ్డదే కనక స్పృశించి విడుస్తున్నాను. వొక్క సామెతలో యెంతో అర్థం యిముడుతుంది.

"తెగితే లింగcడు రాయి, చూడండి. యెనిమిదక్షరాలలో యెంత అర్ధం యిమిడిందోను, "నాకు కోపం వచ్చేవఱకే కాని కోపంవస్తే గౌరవా గౌరవాలు చూసేవాణ్ణి కాను జాగ్రత్త" అని వొక అర్థం స్ఫురిస్తూవుంది. యింకా కొన్ని అర్థాలు పాఠకులే చూచుకోండి. అసలు అక్షరార్థం చెప్పవలసి వస్తే - మెడలో వున్నంతసేపే ఆ రాతిముక్కకీ పరమేశ్వరుఁడనే పూజ్యతగాని అది ఆచోటు వదిలి క్రిందపడ్డట్టయితే దాని గౌరవంవుండదు అని మాత్రమే. దీనికిప్పుడు నేను చెప్పిన విధంగా కాక యింకా కొన్ని విధాల వ్యాఖ్యానం చేయవచ్చును. విస్తరభయంచేత వ్యాకరించలేదు. (స్థాన భ్రంశే నశోభంతే. చూ.) శ్రవణానందంలో "తెగితే లింగండు ఱాయియంచును జనోక్తి నమ్మె నేమో కదా" అని వాఁడబడింది. ఆపద్యం చదువుతుంటే ఆయీ సామెతకు వుండే యావత్తాత్పర్యమూ బోధపడుతుంది. సంస్కృతకవులుకూడా కొన్ని దేశ సామెతలు సంస్కృతీకరించి వాడుకున్నారు. యే కవిత్వంలో సామెతలు విశేషించి వుంటాయో ఆ కవిత్వం యెక్కువ హృద్యంగా వుంటుంది. దానిక్కారణం భాషాజ్ఞానం లేనివాళ్ల క్కూడా దేశసామెతలు సుళు