పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

శా. “ఆ రాజేంద్రుఁడు రాత్రియుం బవలుఁ గామాసక్తిచే నూరిలో
     నీరేజేక్షణలన్ బలాత్కృతిగ నెంతే బాధ పెట్టంగ నా
     యూరన్ గాఁపుర ముండువార లొకరోజొక్కొకఁ డాత్మీయ యౌ
     దారం బంపెద నన్న నొప్పెనఁట! యాతం డెంత ధర్మాత్ముండో?"

రాజులూ, రాజపురుషులూ పూర్వం బకాసురుఁడులాగ నిన్న మొన్నటిదాఁకా సంసారి స్త్రీలను బాధించడం వుండేది. ఆగర్భ శ్రీమంతులుగా పుట్టి దుర్వినీతులైన నౌకర్లచేత పెంచఁబడి దుర్వినీతులై యెందఱో జమీందార్లు లోకబాధకులుగా వుండడం చూచే అనుకుంటాను. ఆనాఁటి విద్వాంసులు రాజులకు ప్రతి వుపచారానికిన్నీ స్త్రీలనే యేర్పఱచినట్టు కనపడుతుంది. కాదంబరివగైరా గ్రంథాలిందుకు వుదాహరణంగా ఉంటాయి. మహా నీతిధురంధురుఁడైన బుద్ధభగవానులుకూడా యీ స్త్రీమయమైన బోనులో కొంతకాలం యితరరాజులవలెనే ఆయా వుపచారాలు అనుభవించి వున్నాఁడు. యొక్కడో తప్ప రాజులకు తఱచు దాసీ సంపర్కం తప్పదన్నమాటే! యెందుచేత? ప్రతిక్షణమందున్నూ వాళ్ల సాన్నిధ్యం కలిగి వుంటుందిగదా?- “కలుగనే కలుగదు కలిగెనేనియును రాజునకు దాసస్త్రీ గమనము గల్గు" అని మేము వ్రాసిందికూడా పైసందర్భాన్ని మనస్సులో పెట్టుకొనియ్యేవే. మొత్తం చామరగ్రాహిత్వం మొదలు పాదసంవాహనకృత్యందాఁకా పూర్వపురాజులకు స్త్రీలవల్లనే జరగడానిక్కారణం చూస్తే వీరిబాధ పతివ్రతాలోకానికి తప్పించడానికేమో అనుకుంటాను. వాళ్లనే రాజదాసీలంటారు. అగ్నిమిత్రుఁడు పెండ్లాడిన మాళవిక యీ తెగలోదే కనక నా వూహను కొంత బలపఱుస్తుంది. కాని ఆపెను రాజకుమారికగా కాళిదాసు సమర్ధించివున్నాఁడు. అది నాటక సాంప్రదాయపు మార్చనుకోవాలి. వీళ్లలో యెక్కడో తప్ప విద్యావంతులుండరు. విద్యతో సంబంధించినజాతి దేవదాసీజాతి. ఆ జాతికే వేశ్యాది శబ్దాలు వర్తిస్తాయి. దక్షిణాదిని యీ కుటుంబాల్లో యెక్కడోతప్ప దేవాలయపు నౌకరీ వుండకుండా వుండదని విన్నాను. స్త్రీలల్లో అనాదిగా నాట్యాభినయాలేమి గానమేమి యీ జాతివల్లనే కాపాడఁబడుతూ వుంది. మేము రంభవంశంవాళ్ల మనిన్నీ వూర్వశి వంశంవాళ్ల మనిన్నీ మేనక వంశంవాళ్ల మనిన్నీ చెప్పుకొనేవాళ్లు పలువురు యీ జాతిలో వున్నారు– “రహి వుట్ట జంత్ర గాత్రముల ఱాల్గరఁగించు విమల గాంధర్వంబు విద్య మాకు” అని పెద్దన్నగారు అప్సర స్త్రీ అయిన వరూధినిచేత చెప్పించివున్నారు. కాదంబరిలో వీళ్ల వంశాలనిగూర్చి చాలా విస్తరించి వుంది. ఆ వంశ వృక్షాలు ‘ఆ కవిస్వకపోలకల్పితమో పూర్వాధారం యేమేనా వుందో ఆలోచించాలి- ఆ వంశ వృక్షాలు అప్సరసలకు సంబంధించినవి. ప్రస్తుతం మన దేశంలో వేశ్యాజాతి ఆ జాతికి సంబంధించిందో కాదో చెప్పలేము. బ్రాహ్మణాదులు ఋషి వంశజుల