పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నిషేధించారు. దానికి ముఖ్య ప్రయోజనం, కూలీ నాలీ చేసుకొని జీవించేవాళ్లు యింట్లో పెళ్లాం బిడ్డలకు అన్నంలేకుండా తెచ్చికొన్నకాస్తా త్రాగుడుకింద వినియోగిస్తున్నారు. కనుక దీన్ని నిషేధిస్తే ఆలాటి సంసారులు కొంత సుఖిస్తారని చెప్పివున్నారు. ప్రస్తుతం బీదలే విశేషించి దీనికి హాజరయ్యేవాళ్లు. కనక దీన్ని నిషేధిస్తే దానితోపాటు కొంత బీదలను సంరక్షించినట్లవుతుందేమో అని నేననుకుంటాను. యేపల్లెటూరునుంచో సకుటుంబంగా దీన్ని చూడడానికి వచ్చే సంసారులు చాలా భాగం వుంటారు. వారికి బళ్లు స్వంతంగా వుంటాయి. వాట్లమీద ప్రయాణం చేస్తారు, వచ్చేది పట్నవాసం కనక అవసరం వున్నా వుండకపోయినా యేదో సామాను కొంత కొంటారు ఆడవాళ్లు. సినీమా ఖర్చు కొంచెమే అయినా ఆ యీ ఖర్చు దానికి యెన్నిరెట్లో తగులుతుంది. ఆ యీ సినీమావల్ల “దుర్నీతి" సునీతికన్న మిక్కిలి అభివృద్ధి అవుతూవున్నట్లు గోచరిస్తుంది. మాటవరసకి– “మాలపిల్ల సినీమా వుందికదా? దానివల్ల నేర్చుకోవలసింది "దుర్నీతి" అందామా? సునీతి అందామా? కొడుకు, వాడికి నచ్చిన కన్యకను వరించి తీసుకువస్తే తండ్రి ఆమోదించవలసిందనేనా? దానివల్ల తేలేఫలితార్థం. ఆయీ సినీమా నోరులేని బ్రాహ్మణ జాతిని అవమానించేది కనక సాగిపోయింది, ఆలాగే కాక మతాభిమానంగల యే మహమ్మదీయులకో, క్రైస్తవులకో యిబ్బంది కలిగించేదే అయితే మఱునాడే నిషేధం తగిలేదే. నాటకరచనలో రసాన్ని భంగించే విషయాలు వుంటే, ఆ విషయం తొలగించి రసానుగుణంగా కథాకల్పన చేయడం సమంజసమని లక్షణ కర్తలు నిర్వచించారు. మచ్చు చూపుతాను, ద్రోణవధ ఘట్టంలో ధర్మరాజు "అశ్వత్థామ హతః" అని అవసరాన్ని బట్టి అబద్ధం ఆడివున్నాడు. దీన్ని వున్నట్టే ప్రదర్శిస్తే ప్రేక్షకులు దుర్నీతిపరులై చెడిపోతారు కనక- "అన్యాధావా ప్రకల్పయేత్" అనే లాక్షణికోక్తినిబట్టి మార్పుచేయడం యుక్తం. యిప్పడు సినీమాలో మార్చేమార్పులు యిలాటివికావు. “పోతన్నగారు” అభిమానశాలి, అయాచకుడు, గర్భవ్యావసాయకుడు, శ్రీరామభక్తుడు అని మాత్రమే కవి పరంపర చెప్పకోవడం. సినీమాలో “అఖండ దాత" అని చిత్రించారు. యిది సుగుణమే అయినా యిట్టి ప్రతీతి లేకపోవడంచేత రుచించదు. యెన్నోయీలాటి వున్నాయి. విస్తరించేదిలేదు. వీట్లవల్ల చరిత్రవిజ్ఞానం పూర్తిగా తబ్బిబ్బవుతూ వుంది. అన్నిటికన్నా మొగుడుతో చెప్పకుండా పెండ్లామూ పిల్లలూ యింటికి తాళంవేసి హాజరవడమనేది ఆర్యుల కుటుంబాలకు బొత్తిగా రుచించేదికాదు. "స్త్రీ స్వాతంత్ర్యం" దీనివల్ల పూర్తిగా వ్యాపిస్తూ వుంది కనక పాశ్చాత్యాపచార వాసన వంటబట్టిన వారికి యిది బాగా రుచించినా ముదుసలి తాతలకు యేదో వెగటుగానే కనపడుతుంది. “విడియాకులు” వగయిరా నూతనాచారాలు అచిరకాలంలో రానైవున్నాయి కనక, దానికియిది "ట్రయినింగు" స్కూలుగా పరిణమించుననడానికి నాకులేశమూ సంశయము