పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

చాటుపద్యమణిమంజరి

దుఃఖించెదరు. అంకినేఁడు చనిపోయెనా యందఱు నాహా యని సంతోషించెద’ రనియెనఁట!

అమరావతిలో నీ వేంకటాద్రినాయని శిలావిగ్రహ మున్నది.

దరిద్రుఁడగు నొకకవి యావాసిరెడ్డి వేంకటాద్రినాయని దాతృత్వము విని యాతని దర్శింపఁ బల్నాడుప్రాంతమునుండి యరుదెంచుచు గుంటూరు చేరునప్పటి కాభూపతి పరలోకయాత్ర గావించినట్లు తెలియరాఁగా నీక్రిందిపద్యమును జెప్పెనందురు.

చ. నలువ! చిచీ! నినుం దలఁప న్యాయముగా దిఁక వేంకటాద్రిభూ
    తిలకునిఁ జంపి యర్థులకు దిక్కు మఱేమొనరించినావు? నీ
    విలఁదలకొట్లమారితన మెన్నఁటికిన్ విడవైతి వౌర! భూ
    తలమున నిట్టిరాజును యథావిధి నీతరమా సృజింపఁగన్?

వేంకటాద్రినాయఁడు ‘వారికి వారికిన్ మఱియు వారికి వారికి వారివారికిన్’ అను సమస్యనీయఁగా వట్ఠెం విరూపాక్షశాస్త్రు లనుకవి యిట్లు పూరించెనఁట.

ఉ. భూరమణీమనఃకుముదపుంజసుధాంశుని వేంకటాద్రిల
    క్ష్మీరమణావతారుని భజింతురు రాజులుఁ దత్సుతున్ హితుల్
    సూరిజనుల్ తదీయులును సొంపుగ నాప్రభు విచ్చుఁ గోరికల్
    వారికి వారికిన్ మఱియు వారికి వారికి వారివారికిన్.