పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

చాటుపద్యరత్నాకరము

తరువాత లక్ష్మణకవి తనయల్లునిచే నప్పీలుచేయించుటకుఁ దగినయత్నముఁజేసి యప్పుడు జడ్జిగా నుండిన బ్రౌనుదొరను దర్శించి యీక్రిందిసీసపద్యము నొసంగెను.

సీసమాలిక


   మధువైరికిన్ వనమాలికిఁ గౌస్తుభ
            హారునకును సంశ్రితావనునకు
   రాధికాప్రియునకు రామసోదరునకు
            జగదీశునకు దయాసాగరునకు
   శ్రీనాథునకును రక్షితదేవసమితికిఁ
            బ్రౌఢభావునకు నారాయణునకు
   నురగేంద్రతల్పున కరిశంఖధరునకుఁ
            దొగలరాయనిగేరుమొగముదొరకు
   రణనిహతదుష్టరాక్షసరమణునకును
   గానమోహితవల్లవీకాంతునకును
   రిపువిదారికి హరికి శ్రీకృష్ణునకును
   కిల్బిషారికి నే నమస్కృతి యొనర్తు.

తెలుఁగునఁ బండితుఁడగు బ్రౌనుదొర లక్ష్మణకవి రచించిన సీసమాలికను గని చాలసంతసించి మీరాక కేమి కారణమని యడుఁగగాఁ గవి తనయల్లునింజూపి యతనికొరకై వచ్చియుంటి నని తెల్పెవు. అతఁ డేమిపనికై వచ్చెనని దొర యడుగఁగా, నీవు వచ్చినపనిని నీవే విన్నవింపుమని మామ చెప్పఁగా మంగన్న యీక్రిందిపద్యములతో విన్నవించెను.