రామకృష్ణుని పద్యమును వినఁగానే యాపండితునికి దీర్ఘాలోచన గలిగెను. ఏమనుటకుఁ దోపలేదు. అర్థమును వచింపలేనన మన సొప్పదు. ఈపద్యమున కర్థమే లేదన గుండె చాలదు. అతఁడట్ల కొంతవడి యోచించి యోచించి— “పండితులారా! ఈపద్యమున కర్థమును నేటిసాయంతనపుసభలో జెప్పెదను” అని సెలవు గైకొని బసకేఁగి పద్యార్థము నిశ్చయించుమార్గము తోఁపక తానువచ్చినమార్గమునుబట్టి మెల్లఁగా వెళ్ళెనఁట. ఆవిషయము నెఱింగి రాజుగారును, తక్కినపండితులును రామకృష్ణుఁడు పన్నిన పన్నుగడకు మిగుల సంతసించిరి.
మఱియొకరోజున వేఱొకకవి రాయలవారిని దర్శించి సభలో నిలువంబడి “నేను జెప్పు పద్యమును గంట మాపక వ్రాయువారుగాని, వ్రాయసమున నన్నోడించువారుగాని యీసభామధ్యమునఁ గలరా?” యని ప్రజ్ఞవలుక రామకృష్ణకవి లేచి “నేను పద్యములను జెప్పెదను. నీవు గంటమాపక వ్రాయఁగలవా?” యని ప్రశ్నించెను. అందుల కాతఁడు “గంట కెన్నిపద్యములఁ జెప్పఁగల” వని రామకృష్ణు నడుగ “గంటకొకపద్యమును జెప్పెద” నని బదులు చెప్పెను. ఆక్రొత్తకవి నిర్లక్ష్యాసూయాసూచకముగ మొగముం జిట్లించి—గంటమును దాటియాకును గైకొని “కానిమ్ము నీయోపి నన్నిపద్యముల గుప్పించు” మనెను. రామకృష్ణుఁడు సాధారణరీతిగాఁ బద్యమును బ్రారంభించి మధ్యలో సంతాపార్థక మగు నొక (వ్రాయవీలుగాని) చిత్రోచ్చారణతోఁ బాదమును బూరించి,